News

పీవోకే ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయాలి: బ్రిటిష్ ఎంపీ

235views

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడిని బ్రిటిష్ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ తీవ్రంగా ఖండించారు. భారత్‌ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను కొనియాడిన ఆయన పీవోకేలోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయాలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు యూకేలోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మాట్లాడిన వీడియోను బాబ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.

‘పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ప్రతిస్పందనగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్థాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై కచ్చితమైన వైమానిక దాడులు చేసింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని అధికార ప్రభుత్వాన్ని బాబ్‌ కోరారు. దీనికి యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీ స్పందించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భయంకరమైనదని లామీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరుకు తమ ప్రభుత్వం భారత్‌, పాక్‌లతో కలసి పనిచేస్తోందన్నారు. శాశ్వత శాంతి నెలకొనేందుకు ఇరుదేశాల మద్దతు అవసరమన్నారు. ఇక, పహల్గాం ఉగ్రదాడిని బాబ్‌ గతంలోనూ ఖండించారు. ఆ సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ తీసుకునే ఎలాంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

గతనెల 22న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట మెరుపుదాడులకు దిగింది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్‌.. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలపై దాడులకు పాల్పడింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా.. ప్రస్తుతం అది కొనసాగుతోంది.