News

పాక్‌కు గుణపాఠం చెప్పడమే.. ప్రతి భారతీయుడి సంకల్పం: యోగి ఆదిత్యనాథ్‌

209views

పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పడం ప్రతి భారతీయుడి సంకల్పమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. తాజాగా లఖ్‌నవూలో జరిగిన మహారాణా ప్రతాప్‌ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన శత్రుదేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ – పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్నారు.

‘‘ఇటీవల దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్‌ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పాల్గొనడం అందరం చూశాం. ఇది వారి సిగ్గులేని చర్యకు నిదర్శనం. దాయాది దేశం ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించడం మాత్రమే కాదు దాన్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయం ప్రపంచం మొత్తం కళ్లారా చూసింది. ఉగ్రవాదంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న పాక్‌.. ఇప్పుడు దాని ఉనికి కోసం పోరాడుతోంది. ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన దారుణం అందరినీ కదిలించింది. ఆ అనాగరిక చర్యకు పాల్పడిన వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదని నరేంద్రమోదీ నిర్ణయించుకున్నారు. ఆ ఘటన జరిగిన నాటినుంచి పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడమే ప్రతి భారతీయుడి సంకల్పంగా మారింది. మన సాయుధ దళాలు పాక్‌కు తగిన బుద్ధి చెప్పాయి. ప్రపంచం ముందు పాకిస్థాన్‌ ఒంటరిగా విలపిస్తోంది’’ అని యోగి అన్నారు.

ఈ పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా ఉండాలని సాయుధ దళాలకు మద్దతు ఇవ్వాలని పౌరులను ఆదిత్యనాథ్‌ కోరారు. ‘‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో భారతీయులంతా బాధ్యతాయుతంగా ఉండాలి. ఇలాంటి సమయంలో వదంతులు వ్యాప్తించే అవకాశాలు ఉన్నాయి. వాటిపై అప్రమత్తంగా ఉంటూ ప్రధాని మోదీ నాయకత్వంపై పూర్తి నమ్మకంగా ఉండాలి. ఈ పోరులో భారత్‌ కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని యోగి ఆదిత్యనాథ్‌ ధీమా వ్యక్తంచేశారు.