
కెనడాలో ఖలిస్థానీల దుశ్చర్యలు ఆగడం లేదు. తాజాగా ఆ దేశం నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటువాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఓ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా వారు భారత ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా, విదేశాంగ మంత్రి జైశంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో ఓ బోన్లో పెట్టి ప్రదర్శించారు.
ఇటీవల ఖలిస్థానీ మద్దతుదారులు ఓ గురుద్వారా, మందిరంలో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం జరగడం గమనార్హం. కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు షవన్ బిండా ఈ వీడియోను ఎక్స్లో పోస్టు చేశారు. ‘‘ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు. ఖలిస్థానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత ఇది. కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణం’’ అని రాసుకొచ్చారు. ఆయన కనిష్కా బాంబింగ్ ఘటనను గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కెనడాకు చెందిన విలేకరి డానియల్ బోర్డమన్ కూడా హిందూ వ్యతిరేకతను రెచ్చగొడుతూ ఖలిస్థానీలు నిర్వహించిన కార్యక్రమం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఖలిస్థానీలపై చర్యలు తీసుకోవడంలో కొత్త ప్రధాని మార్క్ కార్నీకి.. మాజీ ప్రధాని ట్రూడోకు ఏమైనా తేడా ఉందా అని ప్రశ్నించారు.
ఖలిస్థానీలు కేంద్ర మంత్రులను బెదిరించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల రైల్వేశాఖ సహాయమంత్రి రవనీత్ సింగ్ బిట్టూను హత్య చేయడానికి వారు కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో లీకైన కొన్ని స్క్రీన్ షాట్లు తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అమిత్షాపై కూడా ఖలిస్థానీ సంస్థ వారిస్ పంజాబ్దే నాయకులు కక్ష పెంచుకొన్నట్లు పేర్కొన్నారు.





