
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాల వేళ భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనికి భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా స్పందించాడు. ఇంకెంతగా దిగజారుతారంటూ దాయాది ఆటగాడికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
‘‘మేం మీ దేశాన్ని కార్గిల్ యుద్ధంలో ఓడించాం. అది మర్చిపోయారా? ఇప్పటికే మీరు దారుణంగా పతనమయ్యారు. ఇంకా ఎంతకు దిగజారుతారు? ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం మాని.. మీ దేశ పరిస్థితిని మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టండి. భారత సైన్యంపై మేమంతా గర్వపడుతున్నాం’’ అని ధావన్ ‘ఎక్స్’ వేదికగా అఫ్రిదీపై మండిపడ్డాడు.
ఇటీవల పహల్గాం ఉగ్రదాడి పై అఫ్రిదీ మాట్లాడుతూ.. భారత సైన్యాన్ని కించపర్చేలా వ్యాఖ్యానించాడు. ‘‘ఈ దాడిని వారి సైన్యం ఎందుకు అడ్డుకోలేకపోయింది?’’ అంటూ అనుచిత పదజాలంతో భారత్పై అక్కసు వెళ్లగక్కాడు. అఫ్రిదీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.





