
( ఏప్రిల్ 30 – అక్షయ తృతీయ )
అనంత శుభఫలితాలను ఇచ్చేదిగా అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ)ను సంభావిస్తారు. ఇది సామాజిక పర్వదినం. కులమతాలకు అతీతంగా దీనిని జరుపుకుంటారు.
అక్షయం అంటే క్షయం లేనిది, నిరంతరం వృద్ధి చెందేదని అర్థాలు ఉన్నాయి. ఆనాడు చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజాదికాలు, దానధర్మాలు, పితృతర్పణాలు విశేష ఫలితాలనిస్తాయని పరమ శివుడు అమ్మవారికి చెప్పినట్లు మత్స్య పురాణం,ఆ రోజు చేసే దానధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణం పేర్కొంటున్నాయి. అమిత ఫలదాయినిగా భావించి నిర్వహించే ఈ వ్రతానికి లక్ష్మీనాథుడు అధినాయకుడు. మహావిష్ణువు లక్ష్మీదేవిని పరిణయ మాడిన రోజు కూడా ఇదేనట. అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత బంగారం లేదా వెండిని కొనుగోలు చేయాలనే నానుడి స్థిరపడిపోయింది. అందుకే ప్రజలు తమతమ స్థోమతను బట్టి వాటిని కొనుగోలు చేసి అమ్మవారికి అలంకరించి పూజలు చేస్తారు. తహతు లేని వారు లవణం సహా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసినా శుభమనే పెద్దలు చెబుతారు. వాటిని కొనుగోలు చేయటమే కాక ఉన్నంతలో దానధర్మాలు చేయాలని కూడా పెద్దలు చెబుతారు.
త్రేతాయుగం ఆరంభం, పరశురామ, బలరాముల జననం, భగీరథుడు దివిజ గంగను భువికి దింపినది, ద్రౌపదీ మానసంరక్షణకు శ్రీకృష్ణుడు వలువులు ప్రదానం చేసినది, పిడికెడు అటుకుల నివేదనతో బాల్య స్నేహితుడు కుచేలుడికి అనంత ఐశ్వర్యం అనుగ్రహించినది,వనవాస దీక్షలోని పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్రను ప్రసాదించినది ఈ రోజునే. నరనారాయణులు, హయగ్రీవ భగవానుడు ఈ తిథినాడే ఆవిర్భవించారు. శివయ్య వాహనం నంది జన్మించినది ఈ తిథి నాడే కావడంతో ‘బసవ జయంతి’ని జరుపుకుంటారు.
అక్షయ తృతీయ నాడు చేపట్టే పుణ్యకార్యాల ఫలితాలకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథ ప్రకారం, ధర్మనాముడు అనే వైశ్యుడు తనకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసేవాడు. కొంతకాలానికి కాలం చేసిన ఆయన క్షత్రియుడిగా జన్మించి జపహోమాదులు, నిత్యాన్నదానం చేయ సాగాడు. సంపదనంతా వ్యయం చేసే కొద్దీ అది ‘అక్షయం’ (వృద్ధి) అవుతోంది. పూర్వజన్మ సంస్కారం అలా కొనసాగుతూనే ఉంటుందని పెద్దలు చెబుతారు.
అక్షయ తృతీయ విశిష్టతలు





