
పాకిస్థాన్లోని బెలూచిస్థాన్లో భారీ దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై బీఎల్ఏ (బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందారు. పాకిస్థాన్కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ రిమోట్ కంట్రోల్తో పాక్ ఆర్మీ కాన్వాయ్ను పేల్చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ దాడితో కాన్వాయ్లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది.
ఇది బెలూచ్ విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దాడితో పాటు బీఎల్ఏ మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి భారీ హెచ్చరిక జారీ చేసింది. ‘ఇదైతే కేవలం ప్రారంభం మాత్రమే. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదు. మేం మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం’ అంటూ వారు ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే ఈ ఘటనపై మాత్రం పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. కానీ ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాకిస్థాన్ సైన్యం కాస్త అతలాకుతలం అవుతున్నట్లు తెలుస్తోంది. బెలూచిస్థాన్లో భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు సమాచారం.
ఎన్నో దశాబ్దాలుగా స్వతంత్ర బెలూచిస్థాన్ కోసం బీఎల్ఏ పోరాడుతోంది. పాక్ ప్రభుత్వం తమ హక్కులను దూరం చేస్తోందని ఆరోపిస్తూ వరుసగా దాడులకు పాల్పుడుతోంది బీఎల్ఏ. గత కొన్ని నెలలుగా బీఎల్ఏ కార్యకలాపాలు మరింత ఉధృతంగా మారాయి. ఈ దాడి తర్వాత పాక్లో పరిస్థితి అత్యంత అస్థిరంగా మారింది. ప్రజల్లో భయం, భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది. బెలూచిస్థాన్ మాత్రం తమకు ప్రత్యేకమైన దేశం కావాలంటూ మొదటి నుంచి పోరాడుతోంది. తాజాగా పాక్ ఆర్మీ వాహనాన్ని బీఎల్ఏ పేల్చివేయడంతో ఇరు పక్షాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.





