News

‘‘ముస్లిం కమిషనర్’’.. మీ కాలంలోనే బంగ్లాదేశీయులకు ఓటర్ కార్డులు ఇచ్చారు..

485views

వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, రాష్ట్రపతికి బిల్లుల విషయంలో సుప్రీంకోర్ట్ డెడ్‌లైన్ విధించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై బీజేపీలోకి కొంత మంది సుప్రీంకోర్టుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, సుప్రీంకోర్టుపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘‘సుప్రీంకోర్టు తన పరిధి దాటుతోందని, మతఘర్షణకు దారి తీస్తే మీదే బాధ్యత’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు దూబే వ్యక్తిగతమైనవని, బీజేపీ పార్టీ వీటికి దూరంగా ఉంది.

తాజాగా, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)ని టార్గెట్ చేస్తూ దూబే సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ వక్ఫ్ చట్టం ఒక దుష్ట పన్నాగమని, ఇది ముస్లింల భూముల్ని లాక్కోవడానికి తీసుకువచ్చారని ఆరోపించారు. అయితే, ఖురేషీ వ్యాఖ్యలపై స్పందించిన నిషికాంత్ దూబే ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఖురేషీ పదవీకాంలో ముస్లిం ఓటర్లకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. జార్ఖండ్‌లోని సంతాల్ పరగణాలోకి వచ్చిన బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఓటర్ ఐడీ కార్డుల్ని జారీ చేసి, వారిని చట్టబద్ధం చేయడానికి ఖురేషీ అనుకూలంగా వ్యవహరించారని దూబే ఆరోపించారు.

“మీరు ఎన్నికల కమిషనర్ కాదు, మీరు ముస్లిం కమిషనర్. మీ పదవీకాలంలోనే జార్ఖండ్‌లోని సంతల్ పరగణాలో అత్యధిక సంఖ్యలో బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటర్లుగా చేశారు. ప్రవక్త ముహమ్మద్ తీసుకువచ్చిన ఇస్లాం 712 ADలో భారతదేశానికి వచ్చింది – అంతకు ముందు, ఈ భూమి హిందువులకు చెందినది లేదా గిరిజన, జైన లేదా బౌద్ధ విశ్వాసాలతో ముడిపడి ఉంది. నా గ్రామం విక్రమశిల 1189లో భక్తియార్ ఖిల్జీ చేత తగలబెట్టబడింది. విక్రమశిల విశ్వవిద్యాలయం ప్రపంచానికి అతిషా దీపాంకర్ రూపంలో దాని మొదటి వైస్-ఛాన్సలర్‌ను ఇచ్చింది. ఈ దేశాన్ని ఏకం చేయండి, దాని చరిత్రను చదవండి -ఒక విభజన పాకిస్తాన్‌ను సృష్టించింది. ఇక విభజన ఉండదు, ” అని దూబే ఎక్స్‌లో అన్నారు.

అంతకుముందు ఖురేషీ ఎక్స్ వేదికగా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించారు. ‘‘వక్ఫ్ చట్టం నిస్సందేహంగా ముస్లిం భూములను లాక్కోవడానికి ప్రభుత్వం చేసిన దుష్ట ప్రణాళిక. సుప్రీంకోర్టు దానిని గుర్తిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దుష్ట ప్రచారం ద్వారా తప్పుడు సమాచారం బాగా వ్యాపింపచేశారు.’’ అని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 పాలనలో ఖురేషీ భారతదేశానికి 17వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జూలై 30, 2010 నుండి జూన్ 10, 2012 వరకు పనిచేశారు.