News

వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

277views

ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదు సర్వే సందర్భంగా గత ఏడాది నవంబర్ 24న పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. దీంతో ఈ మసీదు సర్వే చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇటీవల రంజాన్ సందర్భంగా ఈ మసీదుకు పెయింటింగ్ వేయడానికి అనుమతి ఇవ్వాలని షాహి జామా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన కోర్టు వారంలోపు పనిని పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే హిందూ పక్షం మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక్కడ హరిహర ఆలయం ఉందని హిందూ బృందం చెబుతోంది. ఇలాంటి సమయంలో ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించింది.

బయటి గోడలకు
అలహాబాద్ హైకోర్టు ఆదేశాన్ని అనుసరించి ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో మార్చి 16 ఆదివారం పెయింటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. మార్చి 12న మసీదు బయటి గోడలకు రంగులు వేసుకునేందుకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో ఎటువంటి చారిత్రక నిర్మాణం దెబ్బతినకూడదని, నిర్మాణాన్ని ప్రభావితం చేయకుండా పని చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కార్మికులు ఈరోజు నుంచి తమ పనిని ప్రారంభించారు. ముందుగా పెయింట్ చేయాల్సిన ప్రాంగణాన్ని కొలిచారు. ఆ తర్వాత నేటి నుంచి పని ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు, ఈ మొత్తం పని భారత పురావస్తు సర్వే సంస్థ అంటే ASI పర్యవేక్షణలో జరుగుతోంది.

జరగాల్సిన ప్రాంతాన్ని..
శనివారం కూడా ASI బృందం పెయింటింగ్ పని చేస్తున్న వ్యక్తులతో పాటు మసీదుకు చేరుకుంది. వైట్‌వాషింగ్ పనులు జరగాల్సిన ప్రాంతాన్ని కూడా ASI బృందం పరిశీలించింది. ప్రస్తుతం సంభాల్ జామా మసీదుకు సున్నం వేయడానికి ఆదివారం ఉదయం కార్మికులు వచ్చి బయటి గోడలకు పెయింటింగ్ వేస్తున్నారు.