
ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ స్థావరం నాగార్జున కొండను సందర్శించిన అంతర్జాతీయ బౌద్ధ బిక్షువులు అక్కడి కట్టడాలు, శిల్పాలను కొనియాడారని పురావస్తు పరిశోధకుడు, ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ, బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ లోని బుద్ధవనంలో ఈ నెల 7న జరిగిన అంతర్జాతీయ త్రిపిటక పఠనోత్సవంలో పాల్గొనేందుకు మన దేశానికి చెందిన 27 మందితో పాటు శ్రీలంక, మయన్మార్, కంబోడియా, లావోస్, థాయిలాండ్, వియత్నాం లాంటి ఇతర దేశాల నుంచి వచ్చిన 88 మంది బౌద్ధ బిక్షువులు విచ్చేశారు. వారికి నాగార్జున కొండలోని బౌద్ధ ప్రదర్శనశాల, పునర్నిర్మించిన బౌద్ధ కట్టడాల గురించి శివ నాగిరెడ్డి వివరించారు. బౌద్ధ ప్రదర్శనశాలలోని శిల్పాల గురించి మ్యూజియం అధికారి కమలహాసన్ వివరించగా, బౌద్ధ బిక్షువులు ఆసక్తిగా ఆలకించి ఆచార్య నాగార్జునడు నడయాడిన నేలపై తాము కూడా అడుగు పెట్టడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, ఆచార్య నాగార్జునని రచనలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయని తెలిపారు





