News

ఫిబ్రవరి 3న లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక

252views

వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఛైర్మన్ జగదాంబికా పాల్ సోమవారం (ఫిబ్రవరి 3, 2025) లోక్‌సభలో సమర్పించనున్నారు. దీంతోపాటు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ జనవరి 31 నుంచి ప్రారంభమైంది. అదే సమయంలో ఈ సెషన్ మొదటి దశ ఫిబ్రవరి 13న ముగుస్తుంది. రెండో దశ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ నివేదికను ఫిబ్రవరి 3న ఉభయ సభలలో సమర్పించనున్నారు. జేపీసీ నివేదిక 16 ఓట్ల మెజారిటీతో ఆమోదించబడింది. అనుకూలంగా 16 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై 2024 ఆగస్టు 8న జేపీసీని ఏర్పాటు చేశారు. జేపీసీ సభ్యులు వక్ఫ్ (సవరణ) బిల్లుపై దాదాపు 17 నెలల పాటు చర్చించారు.

సూచించిన సవరణలు

జనవరి 29న, 655 పేజీల JPC నివేదికను మెజారిటీ సభ్యులు ఆమోదించారు. ఇందులో బీజేపీ సభ్యులు ఇచ్చిన సూచనలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలు సూచించిన సవరణలు తిరస్కరించబడ్డాయి. అంతకుముందు JPC సమావేశంలో, ముసాయిదా బిల్లు, సవరణలను మెజారిటీ సభ్యులు ఆమోదించారు. JPC సభ్యుల మధ్య ఓటింగ్ జరిగింది. సవరించిన బిల్లుకు అనుకూలంగా 16 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు ఈ ముసాయిదాతో తమ విభేదాలను వ్యక్తం చేసి, దీనిని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తుది నివేదికను అధ్యయనం చేయడానికి చాలా తక్కువ సమయం ఇచ్చారని పలువురు అన్నారు.

గత సంవత్సరం కూడా..

అంతేకాదు గత సంవత్సరం వర్షాకాల సమావేశాల్లో కూడా వక్ఫ్ (సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఆ క్రమంలో వక్ఫ్ (సవరణ) బిల్లుపై తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపారు. ఇప్పుడు దానిని తదుపరి సమావేశంలో ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. జేపీసీ ఛైర్మన్ జగదంబికా పాల్ ఈ నివేదికను లోక్‌సభలో సమర్పిస్తారు. అదే సమయంలో జేపీసీ నివేదికను సోమవారం రాజ్యసభలో కూడా సమర్పించనున్నారు. ఆ క్రమంలో మళ్లీ సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తారా లేదా అనేది చూడాలి మరి. అంతకుముందు ఈ నివేదికను జనవరి 30న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు.