
ఇస్లామిక్ దేశం పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఇక అక్కడి హిందూ ఆలయాలు ఎన్ని దాడులకు గురయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది 64 ఏళ్ల తర్వాత పాక్లోని నరోవల్ జిల్లాలోని బావోలీ సాహిబ్ గుడిని అక్కడి ప్రభుత్వం పునర్నిర్మిస్తుండడం విశేషం.
1960లోనే ఈ గుడి మూతపడింది. అయితే నరోవల్ జిల్లాలోని హిందువులు గుడికి వెళ్లాలంటే లాహోర్ లేదా సియాల్కోట్కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ గుడిని పునర్నిర్మించాలని పాక్ ధర్మస్థాన్ కమిటీ 20 ఏళ్ల క్రితమే సిఫారసు చేసింది. గుడి నిర్మాణానికి పాక్ ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించింది.
ద ఎవాక్యూ ట్రస్ట్ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) గుడి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. గుడి పూర్తయిన తర్వాత దానికి ధర్మస్థాన్ బోర్డుకు అప్పగిస్తారు. పాక్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన షోయబ్ సిద్దాల్ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీ చైర్మన్ షోయబ్ సిద్దాల్,నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడు మంజూర్ మసీ గుడి పునర్నిర్మించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.





