ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ అంటూ నిరసనకారులు నినాదాలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిరసన ర్యాలీలో 15 నుంచి 20 మంది ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
ఈ ఏడాది ఆగస్ట్ 9వ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ట్రైయినీ వైద్యురాలికి న్యాయం చేయలని, అలాగే పని ప్రదేశాల్లో తమకు రక్షణ కల్పించాలంటూ వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
ఆ క్రమంలో కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో సైతం వైద్య సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించింది. కశ్మీర్కు స్వాతంత్ర్యం కావాలి (కశ్మీర్ మంగే ఆజాదీ) అంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు బిగ్గరగా నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అవకాశముందని కోల్కతా నగర పోలీసులు భావించారు. దాంతో ఆ వీడియోను పోలీసులు పరిశీలించారు.
అనంతరం కశ్మీర్ ఆజాదీ అంటూ నినాదాలు చేసిన వ్యక్తులపై న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ ర్యాలీ నిర్వహకులకు మరికొద్ది రోజుల్లో పోలీసులు సమన్లు జారీ చేయ్యనున్నారని తెలుస్తుంది. మరోవైపు ఈ వీడియో వైరల్ కావడంపై మమతా బెనర్జీ ప్రభుత్వం స్పందించింది. భారత్లో కశ్మీర్ అంతర్భాగమని ఆ పార్టీ ప్రకటించింది.