
ఐఆర్సీటీసీ భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు –ఎస్సీజెడ్బీజీ27’ని నడుపుతున్నారని.. ఆగస్టు 4 నుంచి 12వ తేదీ వరకు ‘సప్త జ్యోతిర్లింగ దివ్యదర్శన్ యాత్ర’ ప్రారంభం కానుందని తిరుపతి పరిసర జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ సంయుక్తంగా తెలిపారు. అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం వంటి 7 క్షేత్రాలను సందర్శించనున్నట్లు చెప్పారు. ఆగస్టు 4వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యాహ్నం వరకు యాత్ర ఉంటుందన్నారు. యాత్ర సమయంలో ఉదయం టీ, టిఫెన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం (వెజిటేరియన్) అందించనున్నట్లు తెలిపారు. సికింద్రబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమై విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు–రేణిగుంట మీదుగా యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ప్రతీ భోగీలో రైల్వే తరఫున ఎస్కార్ట్స్, ఆయా క్షేత్రాల్లో భక్తులను దగ్గర ఉండి తీసుకువెళ్లడం, తిరిగి రైలుకు చేర్చడం, సమయానికి ఆహారం, మంచినీరు, టాయ్లెట్ల పరిశుభ్రత, రైలులో సీసీ కెమెరాలు, మైక్ ఏర్పాటు, లగేజీ భద్రత, ప్రయాణ బీమా ఉంటుంది.





