ArticlesNews

బలవంతపు మతమార్పిడి ముఠా అరెస్ట్

213views

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో పోలీసులు నిన్న శుక్రవారం నాడు 28మందిని అరెస్ట్ చేసారు. కారణం, వారు బలవంతపు మతమార్పిడులు చేస్తుండడమే. భరత్‌పూర్‌లోని ఒక ఇంటికి చర్చ్ ఫౌండేషన్ అని పేరు పెట్టారు. ఆ ఇంట్లోని వారు మత ప్రచార కూటమి నిర్వహిస్తున్నారు. అక్కడ వ్యవస్థీకృతంగా బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు అందింది.

శుక్రవారం జరుగుతున్న మతమార్పిడి కార్యక్రమం గురించి పోలీసులకు సమాచారం అందింది. దాంతో మథురా గేట్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 20మంది మహిళలు సహా 28మందిని సంఘటనా స్థలంలో అదుపులోకి తీసుకున్నారు.

‘‘రీకో ప్రాంతంలోని ఒక ఇంట్లో మత మార్పిడి చేయడం కోసం కొంతమంది వ్యక్తులు సమావేశమై ఉన్నారని మాకు ఫిర్యాదు అందింది. దాని ఆధారంగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం. వారిని ప్రశ్నిస్తున్నాం. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది’’ అని స్థానిక డిఎస్‌పి సునీల్ శర్మ చెప్పారు.

భరత్‌పూర్‌లోని విశ్వహిందూపరిషత్ సభ్యులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. హిందువులను మతం మార్చడం కోసం క్రైస్తవ మిషనరీలు ఆ కేంద్రాన్ని నడుపుతున్నారు. కార్యక్రమానికి హాజరైతే రూ.500 ఇస్తామని ఆశచూపి హిందువులను రప్పిస్తున్నారు. క్రైస్తవంలోకి మతం మారితే నెలకు రూ.10వేలు ఇస్తామని ప్రలోభపెడుతున్నారు.

విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ నిర్వాహకులను కస్టడీలోకి తీసుకున్నారు.

భరత్‌పూర్‌లో మథురా గేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌టిసి హౌసింగ్ బోర్డ్ భవన్‌పురాలో నివాసముండే నిరంజన్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఈ మతమార్పిడుల గురించి ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదులో చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి….

‘జులై 5 ఉదయం సుమారు 11 గంటలకు రవీంద్ర కుమార్, అతని భార్య మరికొందరు వ్యక్తులు కలిసి ఒక ఇంట్లో సభ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సుమారు వందమంది స్త్రీపురుషులు, పిల్లలు పాల్గొన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న హిందువులను వారు ఆ కార్యక్రమానికి రావాలని ఆశపెట్టారు. కార్యక్రమానికి వస్తే డబ్బులిస్తామని, మతం మారితే ప్రతీనెలా రూ.10వేల చొప్పున ఇస్తామనీ వారు ప్రలోభపెట్టారు’ అని ఆ ఫిర్యాదులో ఉంది.

ఆ ఇంట్లో పట్టుబడిన వారు తమకు కార్యక్రమానికి హాజరైనందుకు రూ.500 ఇచ్చారని ధ్రువీకరించి చెప్పారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఇల్లు రవికుమార్ అనే వ్యక్తిది. హిందూ దేవీదేవతల చిత్రపటాలను కాలువలో పడేసి వారిని అవమానించినందుకు అతన్ని స్వగ్రామం నుంచి బహిష్కరించారు. రవికుమార్ కుటుంబం భరత్‌పూర్‌లో గత నాలుగేళ్ళుగా నివసిస్తోంది. వారు మతమార్పిడులు చేయించడమే వృత్తిగా జీవిస్తున్నారు.

విశ్వహిందూపరిషత్ స్థానిక అధ్యక్షుడు లఖన్‌సింగ్ ఆ ఘటన గురించి ‘‘అక్కడ మతమార్పిళ్ళు జరుగుతున్నాయని మాకు తెలిసింది. మా సభ్యుడు ఒకరిని పంపించాం. అతను అడిగినప్పుడు అక్కడ గ్రంథాలయం నిర్వహిస్తున్నారని చెప్పారు. నిజానికి మతమార్పిడి కార్యక్రమం జరుగుతోందని మాకు అర్ధమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. మతమార్పిడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’’ అని చెప్పారు.

సమీపంలోని సోనార్ హవేలీ ప్రాంతంలో కొంతకాలం క్రితం బలవంతపు మతమార్పిడులు జరిగాయని లఖన్‌సింగ్ చెప్పారు. ఆ విషయం గురించి ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసారని, కానీ ఇప్పటివరకూ ఏ చర్యా తీసుకోలేదనీ ఆవేదన వ్యక్తం చేసారు.