News

అమెరికాలో శేషవాహనంపై ఊరేగిన శ్రీవారు

93views

1998లో ఏర్పాటు అయిన సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం నాడు ఆదిదేవునికి పలు సేవలు, పూజలు, హోమాలు, క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారిని శేషవాహనంపై ఊరేగించారు. శనివారం నాటి కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఉదయం సుప్రభాత, తోమాల సేవల అనంతరం అభిషేక కార్యక్రమాన్ని వేలమంది ప్రవాసుల నడుమ వైభవోపేతంగా జరిపారు. అనంతరం తిరుచ్చి ఉత్సవం పేరిట ఉత్సవమూర్తులను ఆలయానికి ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిక్రమ మార్గంలో (మాఢ వీధులు) ఊరేగించి గరుడ పతక ప్రతిష్ఠ చేశారు. భేరి పూజ, నవసంధి పూజలతో పాటు అగ్నిమథనాన్ని నిర్వహించారు. చెక్కలో ఉన్న నిప్పు రాజేస్తే వెలిగినట్లు సృష్టి అంతా వ్యాపించి ఉన్న పరమాత్మను తెలుసుకోవాలంటే భక్తి ద్వారా సాధ్యమని అర్చకులు క్రతువులను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన గరుడ హోమంలో ప్రవాసులు భక్తిగా పాల్గొన్నారు.

సాయంకాలం కార్యక్రమాల్లో అగ్నిప్రతిష్ఠ, వుక్తహోమం తర్వాత శేషవాహనంపై శ్రీవారిని ఘనంగా ఊరేగించారు. భక్తులకు ఉచితంగా సాంప్రదాయ భోజనాన్ని ఆలయ నిర్వాహకులు అందజేశారు. తంజావూరు నుండి ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చిన వాహనాలపై స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ అన్నారు. ఈ 5 రోజుల వేడుకల్లో 30 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు. మంగళవారం నాడు పూష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని మీడియా కమిటీ ఛైర్మన్ రాజా సూరపనేని తెలిపారు.