News

జగన్మాత అనుగ్రహంతో లోక కల్యాణం

76views

దుర్గమ్మ భక్తులకు సులభంగా వరాలిచ్చే తల్లి. భక్తులను తన కంటి రెప్పలా కాపాడుకునే ఆ తల్లి వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంత విన్నా తనివితీరదని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘శ్రీమాత వైభవం’ప్రవచనాన్ని చాగంటి కోటేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. తొలుత ఆయనకు దేవస్థానం వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం చాగంటి మాట్లాడుతూ జగన్మాత దుర్గాదేవి వైభవాన్ని వివరించే అదృష్టం రావడం పూర్వజన్మ సుకృతం అన్నారు. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే దుర్గమ్మ అను గ్రహాన్ని పొందేందుకు భక్తులు తపన చెందడం అనాదిగా వస్తుందన్నారు. త్రేతాయుగం, ద్వాపర, కలియుగాల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజులు, మహారాజులు పూజలు చేసినట్లు చరిత్ర చెబుతోందన్నారు. అటు వంటి గడ్డపై పుట్టిన మనం అదృష్టవంతులుగా భావించి మంచి మార్గంలో నడవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.