News

నారద జయంతితో జాతీయవాదుల ఐక్యత: ఐవైఆర్

73views

తెలుగు జర్నలిజం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుందని, ఇపుడు నేషనల్‌ మీడియా యుగం నడుస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణరావు అన్నారు. గతంలో జర్నలిజంలో అంతా మేనేజ్‌మెంట్‌ యుగమే నడిచిందని, ఇప్పుడు పాత్రికేయులే కాకుండా సామాన్య పౌరులు కూడా సోషల్ మీడియాలో ద్వారా యాక్టివ్‌గా అయిపోతున్నారని, ఇదో కొత్త పంథా అని తెలిపారు. నారద జయంతి నేపథ్యంలో సమాచార భారతి సంస్థ శుక్రవారం హైదరాబాదులో పాత్రికేయులకు అందించిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఐవైఆర్‌ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సోషల్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిజం పోకడే మారిపోయిందన్నారు. ఇందులో మంచి, చెడూ రెండూ వున్నాయని, అయితే ఫేక్‌ న్యూస్ బాగా ప్రచారం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక మరోవైపు కమ్యూనిస్టులు చాలా పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని, జాతీయవాదులు పూర్తిగా సంఘటితం కావడం ద్వారానే దానిని తట్టుకోగలమని కృష్ణారావు పేర్కొన్నారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు చాలా ఉన్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు. ఇక అన్ని యుగాలలోనూ నారదుడు ఉన్నారని పేర్కొంటూ రావణాసురుడు, నరకాసురుడు వంటి రాక్షసుల దగ్గరకు కూడా వార్తలు చెప్పడానికి నారదుల వారు వెళ్లారన్నారు. అయితే ఆ రాక్షసుల నుంచి నారదునికి బెదిరింపులు వుండేవి కావని, అదే నేటి ఆధునిక యుగంలో తమకు అనుకూలంగా రాయాలంటూ పాత్రికేయులను బెదిరించే రోజులు వచ్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.