భారత్లో ప్రతీ విద్యార్థి చదవాల్సిన ఓ పుస్తకాన్ని ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పంచుకున్నారు. పాల్ జి.హెవిట్ రాసిన ‘కాన్సెప్చువల్ ఫిజిక్స్’ను (Conceptual Physics) ప్రతిఒక్కరూ చదవాలని సూచించారు. దీన్ని రచయిత అద్భుతంగా రాశారని.. అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
‘‘ప్రస్తుతం నేను కాన్సెప్చువల్ ఫిజిక్స్ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. దీన్ని హైస్కూల్ టీచర్ పాల్ హెవిట్ రాశారు. హైస్కూల్ విద్యార్థులను దృష్టిలోఉంచుకొని రచించారు. ఫిజిక్స్ ఎలా బోధించాలో అద్భుతంగా వివరించారు. రచయిత నుంచి అనుమతి లభిస్తే దీన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలి. దీంట్లో అద్భుతమైన ఎక్సర్సైజులు ఉన్నాయి. క్లిష్టమైన ఐడియాలను చాలా చక్కగా వివరించారు. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి.. మేఘాలయ నుంచి జామ్నగర్ వరకు ప్రతిఒక్కరూ దీన్ని చదవాలి. ‘సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేథమేటిక్స్ సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది’’ అని ఓ ప్రముఖ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణమూర్తి వెల్లడించారు.





