News

‘పీఓకే’లో ఆందోళనలపై మంత్రి జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు

230views

పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌(పీఓకే) ఎప్పటికీ భారత్‌దేనని విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న ఆందోళనలపై కోల్‌కతాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ‌జైశంకర్‌ స్పందించారు.

పీఓకేలో ఉన్న ప్రజలు తమ జీవన ప్రమాణాలు, జమ్మూకాశ్మీర్‌లో ఉన్న ప్రజల జీవన స్థితులతో పోల్చుకుంటున్నారన్నారు. ‘పీఓకేలో ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయి. వాటికి గల కారణాలు విశ్లేషించడం అంత సులభం కాదు.అయితే పీఓకే ప్రజలు తమ జీవన పరిస్థితులను జమ్మూ కాశ్మీర్‌ ప్రజల జీవన ప్రమాణాలతో పోల్చుకుంటున్నారని నా అభిప్రాయం. తాము వివక్షకు గురవుతున్నామని పీఓకే ప్రజలు భావిస్తున్నట్లున్నారు’అని జైశంకర్‌ అన్నారు.

కాగా, ఇటీవల పెరిగిపోయిన ఆహారం, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని పీఓకే ప్రజలు ఆందోళన బాట పట్టారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులపై దాడికి దిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.