
307views
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. తాజా పరీక్షలో క్షిపణికి సంబంధించిన అన్ని ఉపవ్యవస్థలు నిర్దేశిత రీతిలోనే పనిచేశాయని అధికారులు పేర్కొన్నారు. ఐటీసీఎం ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. దేశీయ చోదక వ్యవస్థతో కూడిన స్వదేశీ దీర్ఘశ్రేణి సబ్సోనిక్ క్రూజ్ క్షిపణిని అభివృద్ధి చేయడం భారత పరిశోధన ప్రస్థానంలో ఓ కీలక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. రాడార్, ఎలక్ట్రోఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థ, టెలిమెట్రీ వంటి సెన్సర్ల సాయంతో ఐటీసీఎం ప్రయాణ మార్గాన్ని మొత్తం పరిశీలించినట్లు డీఆర్డీవో పేర్కొంది.





