
అమెరికాలో హిందువులు, హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు గణనీయంగా పెరిగాయని ఇండో-అమెరికన్ చట్టసభ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులకు వ్యతిరేకంగా సమన్వయంతోనే ఈ తరహా దాడులు జరుగుతున్నాయని, ఇది ఆరంభం మాత్రమేనని చట్టసభ సభ్యుడు శ్రీ తానేదార్ అన్నారు. ఆన్లైన్ సహా ఇతర మార్గాల ద్వారా పెద్ద స్థాయిలో అసత్య ప్రచారం సాగుతోందన్నారు.
నేషనల్ ప్రెస్క్లబ్లో హిందూయాక్షన్ అనే స్వచ్ఛందసంస్థ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తానేదార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. హిందువులకు వ్యతిరేకంగా ఇంత జరుగుతున్నా దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోలేదని, ఇప్పటికీ ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. దర్యాప్తు సంస్థలు విచారణ మొదలుపెడుతున్నప్పటికీ ముందుకు సాగడం లేదన్నారు. హిందూ ప్రార్థనా మందిరాలపై దాడులకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ తనతో సహా పలువురు ఇండో అమెరికన్ చట్టసభ సభ్యులు, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కు ఇటీవల లేఖ రాసినట్లు తెలిపారు.





