
భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో భారత్ గౌరవ్ టూరిస్టు రైలును నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా ఒక ప్రకటనలో తెలియజేశారు. పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. ఈ యాత్ర రైలు ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా వెళుతుందన్నారు. తిరిగి యాత్ర ముగించుకుని వచ్చే నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ రైలు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. ఇందుకు స్లీపర్ క్లాస్ టిక్కెట్ ధర రూ.16,525, థర్డ్ ఏసీ టిక్కెట్ ధర రూ.25,980, సెకండ్ ఏసీ టిక్కెట్ ధర రూ.33,955గా నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని చెప్పారు. పూర్తి వివరాలు, టిక్కెట్ల కొరకు తమ వెబ్సైట్ను గాని, ఐఆర్సీటీసీ విజయవాడ కార్యాలయం నందు గాని సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు ఐఆర్సీటీసీకి చెందిన ప్రవీణ్ 92814 95848, రాజేష్ 89773 14121 నంబర్లలో సంప్రదించాలని ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలియజేశారు.





