ArticlesNews

భాగవత పారాయణం… పాపహరణం

458views

ఒకసారి శౌనకుడు ‘శ్రీమద్భాగవతాన్ని ఎవరు, ఎవరికి వినిపించారు, అది వినడం వల్ల ప్రయోజనాలేమిటో తెలియజేయండి’ అన్నాడు సూతమహామునిని ఉద్దేశించి. సూతుడు బదులిస్తూ ‘తొలిసారి భాద్రపద మాసం, శుక్ల పక్షం, నవమి తిథి నాడు శుకదేవుడు భాగవతాన్ని పరీక్షిత్తుకి వినిపించాడు. రెండోసారి ఆషాడ మాసం, శుక్ల పక్షం, నవమి తిథి నాడు గోకర్ణుడు దుందుభికి వినిపించాడు. మూడోసారి కార్తీక మాసం, శుక్ల పక్షం, నవమి తిథి రోజున బ్రహ్మదేవుడి కుమారులైన సనక సనందనాది మహర్షులు భాగవతాన్ని నారదుడికి వినిపించారు. ఇక భాగవతం వినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే.. ఇది శ్రీకృష్ణుడుకి ఎంతో ఇష్టమైంది. అహాన్ని నశింపచేయడానికి శ్రీమద్భాగవతం దివ్య ఔషధం. అది సమస్త పాపాలనూ నశింపచేస్తుంది. ముక్తి పొందడానికి ఏకైక కారణమైన భక్తిని పెంచుతుంది. యమధర్మరాజు కూడా తన దూతలతో ‘భాగవత కథలో నిమగ్నమై ఉండే మనుషులకు దూరంగా ఉండాలని, వారి పట్ల తన అధికారం చెల్లదని, భక్తి లేనివారిని దండించడానికి మాత్రమే తనకి అధికారం ఉందని’ చెబుతాడు. అంతటి మహత్తు గల భాగవతాన్ని పారాయణం చేయడం ఎంతో అవసరం’ అంటూ వివరించాడు.