News

రామమందిర ఉద్యమం స్వాతంత్ర్యోద్యమం కంటే పెద్దది

241views

అయోధ్యలో రామమందిరం కోసం జరిగిన ఉద్యమం దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమం కన్నా సుదీర్ఘమైనది అన్నారు విశ్వహిందూ పరిషత్ నాయకుడు శరద్ శర్మ సుమారు 500ఏళ్ళు సాగిన ఈ ఉద్యమంలో లక్షలాది ప్రజలు ప్రాణాలు త్యాగం చేసారని గుర్తు చేసుకున్నారు.

‘‘రామమందిరం కోసం జరిగిన ఉద్యమం స్వాతంత్ర్యోద్యమం కంటె పెద్దది(Ayodhya struggle bigger than Independence struggle). ఇదొక ధార్మిక ఉద్యమం. ప్రజలు దీన్ని మతం, సంస్కృతి, చరిత్రతో కూడిన ఉద్యమంగా భావించారు కాబట్టే ప్రజలు దీన్ని ఒక తుది అంకానికి తీసుకురాగలిగారు. ఈ ఉద్యమంలో లక్షలాది ప్రజలు తమ ప్రాణాలు త్యాగం చేసారు. ఈ ఉద్యమం 5శతాబ్దాల పాటు కొనసాగింది. అందువల్ల దీన్ని దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమం కంటె పెద్దదని భావించవచ్చు’’ అని శరద్ శర్మ స్పష్టం చేసారు.

ఈ నెల 22న జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ కోసం 7వేల ఆహ్వానాలు(7000 invitations)పంపించామని ఆయన చెప్పారు. ‘‘సుమారు 4వేల మంది సాధువులు, మరో 3వేల మంది ఇతరులను ఆహ్వానించాం. ఆహ్వాన పత్రిక మొదటి పేజీ మీద రాంలల్లా ముద్ర ఉంటుంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల నిర్వహించే సమయంతో సహా అన్ని వివరాలూ ఆహ్వాన పత్రికలో ఉంటాయ’’ని తెలియజేసారు.

‘‘దానితో పాటు, 1949 నుంచీ రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నవారి వివరాలతో ఒక పుస్తకాన్ని కూడా ఇస్తున్నారు. ఆ ఉద్యమం గురించి సరిగ్గా తెలియని ఆధునిక తరానికి ఆనాటి సాహస గాధలను తెలియజేయడానికి ఆ పుస్తకం సాయపడుతుంది’’ అని ఆయన చెప్పారు.

రామమందిర నిర్మాణం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ప్రశంసించారు. కోట్లాది భారతీయుల స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని ఆయన అభినందించారు. ‘‘శ్రీరామచంద్రమూర్తి అందరికీ మేలు చేస్తాడు. రామమందిరానికి ప్రాణ ప్రతిష్ట జరిగే జనవరి 22 కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ధీమా వ్యక్తం చేసారు.

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ విధులకు హాజరయ్యే పోలీసు అధికారులు మొబైల్ ఫోన్లు వాడకూడదని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక డీజీపీ (శాంతి భద్రతలు) ప్రశాంత్ కుమార్ ఆదేశించారు. అలాంటి అధికారుల కోసం ప్రవర్తనా నియమావళిని డీజీపీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసారు.

ఆనాటి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని బీజేపీ భావిస్తోంది. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ బూత్ స్థాయిలో పెద్దపెద్ద డిజిటల్ స్క్రీన్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని భావిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఆరోజు సమాజసేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది.