
విజయవాడలో ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడురోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు.
జనవరి 14 శనివారం నాడు భోగి పర్వదినం నాడు తెల్లవారుజామున 5గంటలకు చిన్న రాజగోపురం దగ్గరున్న లక్ష్మీగణపతి మందిరం వద్ద భోగిమంటలు వేస్తారు. తర్వాత హరిదాసుల సంకీర్తన, బసవన్నల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలూ జరుగుతాయి.
అదే రోజు మల్లికార్జున మహామండపం 7వ అంతస్తులో రాజగోపురం ఎదురుగా కళావేదికలో ‘బొమ్మలకొలువు’ ప్రదర్శన మొదలవుతుంది.
ఆ రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు కళావేదిక దగ్గర గొబ్బెమ్మలు తీర్చిదిద్దుతారు. తర్వాత చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసే కార్యక్రమం నిర్వహిస్తారు.
జనవరి 15 ఆదివారం సంక్రాంతి, జనవరి 16 సోమవారం కనుమ పండుగల సందర్భంగా ప్రత్యేక పూజాకార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
సంక్రాంతి సంబరాల సందర్భంగా కనకదుర్గమ్మ ప్రధాన ఆలయం, ఉపాలయాలు, రాజగోపుర ప్రాంగణం, ఇతర దేవస్థాన ప్రాంగణాలను ప్రత్యేకంగా పూలతో అలంకరిస్తారు. రంగవల్లులు తీర్చిదిద్దుతారు. హిందూ సనాతన ధర్మం, తెలుగుదనం ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.





