News

సాగరగర్భంలో దాగిఉన్నా పట్టుకుంటాం : రాజ్‌నాథ్ సింగ్

231views

భారతదేశపు మర్చెంట్ నేవీ ఓడలపై(Merchant Navy Ships)దాడులకు పాల్పడినవారిని ‘సాగరగర్భంలో దాగి ఉన్నా పట్టుకుని తీరతాం, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ’ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh)అన్నారు. భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ ఇంఫాల్’ను(INS Imphal commissioned)మంగళవారం ముంబైలో సాగర ప్రవేశం చేయించారు. ఆ కార్యక్రమానికి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.

ఆ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల భారతదేశపు మర్చెంట్ నేవీ షిప్స్ మీద దాడులు(Drone Attacks on ships)చేసిన వారిని ఎక్కడున్నా సరే, సముద్రంలో దాగిఉన్నా సరే, పట్టుకుని తీరతామని చెప్పారు. అరేబియా సముద్రంలో ఎంవి కెమ్ ప్లూటో(MV Chem Pluto)నౌక మీద, ఎర్రసముద్రంలో ఎంవి సాయిబాబా(MV Saibaba)నౌక మీద డ్రోన్ దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని రాజ్‌నాథ్ చెప్పారు.

‘‘సముద్రజలాల్లో నిఘాను భారత నౌకాదళం మరింత కట్టుదిట్టం చేసింది. ఆ దాడులు చేసినవారు సముద్రం అట్టడుగున దాగిఉన్నావారిని కనిపెట్టి తీరతాం, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా భద్రత కల్పించాల్సిన బాధ్యత భారతదేశానిదేనని ఆయన గుర్తు చేసారు.

ఎంవి కెమ్ ప్లూటో నౌకపై రెండురోజుల క్రితం డ్రోన్ సాయంతో దాడి చేసినట్లు భారత నౌకాదళం ధ్రువీకరించింది. దేశ పశ్చిమ తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో నౌక ఉండగా ఆ దాడి జరిగింది. ఇరాన్ మద్దతిస్తున్న, యెమెన్ దేశానికి చెందిన హౌతీ ఉగ్రవాదులు ఆ దాడికి పాల్పడ్డారు. సౌదీ అరేబియా నుంచి మంగుళూరు వస్తున్న ఆ నౌక మీద, దాడి కారణంగా మంటలు చెలరేగాయి.
21మంది క్రూ సిబ్బందితో కూడిన కెమ్ ప్లూటో నౌక ఈ ఉదయం ముంబై తీరానికి చేరుకుంది. డ్రోన్ దాడిలో ఓడకు పక్కవైపు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది. పూర్తి వివరాలు తెలియడానికి ఫోరెన్సిక్ విశ్లేషణ చేయించాల్సి ఉంది.

ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న మరో నౌక ఎంవి సాయిబాబా మీద కూడా డ్రోన్ దాడి జరిగిందని భారత-అమెరికా సైనికాధికారులు ధ్రువీకరించారు. ఆ ఓడలో 25మంది భారతీయ క్రూ ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.

ఇలా, వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను నివారించడానికి భారత నౌకాదళం మూడు యుద్ధనౌకలను మోహరించింది.