
సాధారణంగా అనేక మంది అందరి దేవుళ్లను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కానీ యమధర్మరాజు పేరు తలుచుకోవడానికి కూడా భయపడతారు. అందుకే యముడికి ఆలయాలు నిర్మించి పూజలు చేయడానికి వెనకాడుతారు. అయితే ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో మాత్రం యముడు విశేష పూజలు అందుకుంటున్నాడు. ఏడాదికోసారి వచ్చే ‘యమ ద్వితీయ’ నాడు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి.. తమకు దీర్ఘాయుష్షు ప్రసాదించమని కోరుకుంటున్నారు.
కార్తిక శుక్ల పక్ష ద్వితీయ రోజు..
అయోధ్యలోని సరయూ నది ఒడ్డున యమతారా ఘాట్ వద్ద ఈ యమధర్మరాజు ఆలయం ఉంది. ఏడాది పొడవునా భక్తుల తాకిడి తక్కువే అయినా.. కార్తిక శుక్ల పక్ష ద్వితీయ (యమ ద్వితీయ) రోజు జరిగే జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. శని గ్రహ దోషాలు, జాతక దోషాలు ఉన్న వారు ఇక్కడికి వచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయుష్షు కోసం యమదేవుడిని పూజిస్తారు.
నరక మహాదశ నుంచి విముక్తి..
యమ ధర్మరాజు ఆలయ విశిష్టతను రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వివరించారు. ”యమ ద్వితీయ రోజున యమధర్మరాజును పూజించడం ద్వారా నరక మహాదశ నుంచి విముక్తి లభిస్తుంది. సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయుష్షు కోసం యమ ద్వితీయ రోజు యముడిని పూజిస్తారు. అయోధ్యలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి పండుగ అయోధ్య నుంచే వచ్చింది. దీపావళి తర్వాత వచ్చిన ద్వితీయ తిథి రోజు యమ ద్వితీయను ప్రజలు జరుపుకుంటారు” అని సత్యేంద్ర దాస్ చెప్పారు.
అయోధ్యాదేవి ఆశీర్వాదంతో..
అయోధ్యకు దేవాలయాల నగరంగా పేరు ఉంది. ఈ నగరంలో చిన్నాపెద్దా కలిపి సుమారు 5000 వేల ఆలయాలు ఉన్నాయి. సీతారాములు, హనుమాన్, దుర్గా దేవి, స్వామి నారాయణ్ భగవాన్, జగన్నాథ ఆలయం, కామాక్షి దేవి, వేంకటేశ్వరస్వామితోపాటు అనేక దేవాధిదేవతల ఆలయాలు ఉన్నాయి. అయితే అయోధ్యాదేవి నుంచి పొందిన ఆశీర్వాదం ఆధారంగా.. యమధర్మరాజు ఇక్కడ కొలువుదీరాడని పురాణాలు చెబుతున్నాయి.





