
ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేశారు. అట్టహసంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కేదార్నాథ్ ఆలయాన్ని ఏటా దీపావళి పండుగ రెండు రోజుల తర్వాత మూసివేస్తారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆలయ తలుపులను మూసేశారు. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
బుధవారం ఉదయం 8 గంటలకు ఆలయ పూజారులు మంత్రాలను పఠిస్తూ.. తలుపులను మూసివేశారు. ఆలయం తెరిచే కార్యక్రమంలాగే.. మూసివేసే కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. తలుపులు మూసివేసే సమయంలో హర హర మహాదేవ్ అంటూ భక్తులు నామస్మరణ చేశారు.
భక్తి శ్రద్దలతో శివయ్య పంచముఖీ దేవత విగ్రహం శ్రీ ఓంకారేశ్వరాలయం, ఉఖీమఠ్కు తీసుకుని వచ్చారు. ఆ సమయంలో జై బోలో శంకర్ నినాదాలు చేస్తూ వేలాది మంది భక్తులు స్వామివారి వెంట నడిచారు. వచ్చే 6 నెలల పాటు ఉఖీమఠ్లోనే శివయ్యకు పూజలు నిర్వహించనున్నారు.





