
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 19న జరుగనున్న గరుడవాహనసేవ దర్శనాన్ని ఎక్కువ మంది భక్తులకు కల్పించాలనే ఉద్దేశంతో రాత్రి 7 గంటలకు బదులుగా సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. అదేవిధంగా, ఎక్కువ మంది సామాన్య భక్తులకు మూలమూర్తి దర్శనం కల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడసేవను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ముందురోజు నుండే గ్యాలరీల్లో నిరీక్షిస్తుంటారు. వారి సౌలభ్యం మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాతే రాత్రి వాహనసేవ నిర్వహిస్తారు. కాగా, అక్టోబరు 19న సాయంత్రం 6.15 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. ఆ తరువాత సాయంత్రం 6.30 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుంది. గతంలో రాత్రి 9 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుండగా, ఆ సమయాన్ని రాత్రి 7 గంటలకు మార్చారు. ప్రస్తుతం ఆగమ సలహామండలి నిర్ణయం మేరకు గరుడసేవ సమయాన్ని అరగంట ముందుకు మార్చడం జరిగింది.
కాగా, బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే అనుమతిస్తారు. అక్టోబరు 14న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబరు 14 నుండి 23వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.





