News

ఉడిపిలో బయటపడ్డ లింగముద్ర రాయి

232views

కర్నాటకలోని ఉడిపి జిల్లాలో సూర్యుడు, చంద్రుడు, శివలింగం, నంది శాసనాలతో కూడిన ‘లింగ ముద్ర’ రాయిని గుర్తించారు పురావస్తు శాస్త్రవేత్తలు. కుందాపురా తాలూకాలోని బస్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అశోకా పార్కులో చదును చేస్తుండగా 400 ఏళ్ల నాటి రాయి దొరికింది. స్థానికుల సహకారంతో దాన్ని తరలించారు. ఈ విషయాన్ని ఓ చరిత్రకారుడి దృష్టికి తీసుకెళ్లారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం నాటి రాజు రాజ్యం జీవించేదని రాయిపై ఉన్న సందేశం సూచిస్తోందని చరిత్రకారుడు ప్రొ. టి. మురుగేశి తెలిపారు.

శైవులు శివుడిని, వైష్ణవులు విష్ణువును, జైనులు తీర్థంకరులను పూజించడం సర్వసాధారణం. శైవులు తమ భూమి సరిహద్దుల్లో లింగ ముద్ర రాళ్లను అమర్చగా వైష్ణవులు వామన ముద్ర రాళ్లను, జైనులు ముక్కోడే రాళ్లను ఉపయోగించారు. ఇది వారి భూమి సరిహద్దులను గుర్తించే మార్గం. దీని ప్రకారం, బస్రూర్‌లో దొరికిన లింగ ముద్ర రాళ్లను సరిహద్దు గుర్తుగా ఉంచారని ప్రొ. మురుగేశి వివరించారు.