News

నింగిలో ‘నిఘా’ నేత్రం..!..

784views

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు.. విజయాలు అలవాటుగా మారాయి. ఇటీవలికాలంలో ఇస్రో ప్రయోగాలకు ఎదురులేకుండా పోతోంది. ముఖ్యంగా ఓటమన్నది ఎరుగని పీఎస్ఎల్వీ.. ఇస్రో కీర్తిని మరింత పెంచింది. రక్షణ అవసరాల కోసం చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ45 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా.. ఇంటలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్ తో పాటు.. విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది ఇస్రో. డీఆర్డీవో, ఇస్రో సాధించిన ఘనతకు.. ఇప్పుడు దేశమంతా గర్వపడుతోంది. పీఎస్ఎల్వీ-సీ45 ప్రయోగం సక్సెస్ పట్ల జేజేలు కొడుతోంది. ఇమిశాట్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల రక్షణ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ.. ఇమిశాట్ గొప్పతనమేంటి..? ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించుకుని శత్రువుకు మన సైన్యం ఎలా చెక్ పెడుతుంది..? అదెలా సాధ్యం..?  దేశ సరిహద్దు రక్షణకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఉండాలంటే.. బలమైన సైనిక పాటవం కావాలి. అత్యాధునిక ఆయుధాలుండాలి. వాటిని సరైన దిశలో నడిపించగల సమర్దవంతమైన నాయకత్వం కావాలి. కానీ, ఇవి మాత్రమే ఉంటే.. ఇప్పుడు లాభం లేదు. అంతరిక్షం నుంచి దూసుకువచ్చే ముప్పును కూడా తట్టుకోగలగాలి. అందుకే.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది భారత్. శత్రుదేశాల ఉపగ్రహాల పనిపట్టే.. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది.

భారత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇస్రో, డీఆర్డీవో వెన్నుదన్నుతో.. శత్రుదేశాలను నివ్వెరపరిచేలా భారత నిఘా వ్యవస్థలోకి తిరుగులేని ఆయుధం రంగప్రవేశం చేసింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సి45 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. పరాజయం అంటూ ఎరుగని ఈ రాకెట్.. రక్షణ రంగానికి సంబంధించిన ఇమిశాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. డీఆర్డీఓకి చెందిన ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. షార్ కేంద్రంలోని రెండో లాంచింగ్ ప్యాడ్ నుంచి సోమవారం ఉదయం 9 గంటల 27 నిమిషాలకు నింగిలోకి ఎగిసిన పీఎస్ఎల్వీ సీ45 రాకెట్.. 17 నిమిషాల తర్వాత 753.6 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ఇమిశాట్ ను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. అక్కడ నుంచి 1 నిమిషాల 50 సెకన్లలో నాలుగు దశలను పూర్తిచేసిన పీఎస్ఎల్వీ లిథువేనియా, స్పేయిన్‌, స్విట్జర్లాండ్‌, అమెరికాకు చెందిన 28 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. వీటిని 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టింది. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 47వది కాగా, షార్ చేపట్టిన 71వ ప్రయోగం. ఇక 2019లో ఇది ఇస్రో చేపట్టిన రెండో పీఎస్ఎల్వీ ప్రయోగం. అంతేకాదు, ఎక్కువ సమయం ప్రయాణించిన రాకెట్ ప్రయోగాల్లో ఇది కూడా ఒకటి. గతేడాది జనవరిలో పీఎస్ఎల్వీ సీ40 ప్రయోగానికి 2 గంటల 21 నిమిషాల సమయం పట్టింది. ఇక, తాజా ప్రయోగం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. పీఎస్ఎల్వీలో ఇంధనాన్ని మండించడానికి అధునాత బూస్టర్లను వినియోగించారు. మొత్తం నాలుగు దశల్లో ఒక్కో దశలో 12.2 టన్నుల బరువును మోసుకుపోయే సామర్థ్యంతో రూపొందించి, మూడు వేర్వేరు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. మొదటి పేలోడ్‌లోని ఆటోమెటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ సముద్ర జలాల్లోని నౌకల గురించి సమాచారాన్ని సేకరిస్తుంది. అలాగే రెండో పేలోడ్‌ ఆటోమేటిక్‌ ప్యాకెట్‌ రిపీటింగ్‌ సిస్టమ్‌లోని రేడియో అమెచ్యూర్‌ శాటిలైట్‌ కార్పొరేషన్‌ ప్రయోగాత్మకంగా అధునాతన సాంకేతికతకు సంబంధించి పరిశోధనలు నిర్వహించనుంది. ఇక మూడో పేలోడ్‌‌లో అమర్చిన అడ్వాన్స్‌డ్‌ రిటార్డింగ్‌ పొటెన్షియల్‌ అన్‌లైజర్‌ ఫర్‌ ఐనోస్పిరిక్‌ స్టడీస్‌ ద్వారా రాబోయే ఆరు నెలల్లో వాతావరణంలోని ఐనోస్పియర్‌పై పరిశోధనలు చేపడతారు.  మూడో దశలో 508 కిలోమీటర్ల ఎత్తున దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి రాకెట్ ప్రవేశించిన తర్వాత నాలుగో దశకు వెళ్ల సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. నాలుగో దశలో 485 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చేర్చే సమయంలో ఇంజిన్ రెండుసార్లు మొరాయించింది. దీంతో ఇంజిన్ రీ-స్టార్ట్ చేసి తక్షణమే లోపాన్ని సరిదిద్ది పేలోడ్‌ను విజయవంతంగా నాలుగు దశకు చేర్చారు. ఇక ప్రయోగం విజయవంతం చేసినందుకు ఇందులో భాగస్వామైన వారందరికీ ఇస్రో చైర్మన్ కే శివన్ శుభకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి రిశాట్, కార్టోశాట్ 3, చంద్రయాన్-2 సహా మరో 30 ప్రయోగాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం నింగిలోకి పంపిన ఉపగ్రహాలు తమ కక్ష్యలో చేరడంతో తమ ప్రాథమిక లక్ష్యాన్ని చేరుకున్నామని శివన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఒకేసారి 29 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా జంబో ప్రయోగాల్లో ఇస్రో మరోసారి సత్తా చాటింది. గతేడాది ఫిబ్రవరి 15న జరిగిన ‘పీఎస్ఎల్‌వీ-సీ37’ రాకెట్ రికార్డు స్థాయిలో ఏకంగా 104 శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోని వివిధ కక్ష్యల్లోకి విజయవంతంగా చేరిన 104 ఉపగ్రహాల్లో కేవలం మూడు మాత్రమే భారత్‌కు చెందినవి. మిగతా 101 ఉపగ్రహాలూ విదేశాలకు చెందినవే.
తాజాగా ప్రయోగించిన 436 కేజీల ఇమిశాట్ ఉపగ్రహాన్ని భారత రక్షణ అవసరాలకోసం డీఆర్డీవో రూపొందించింది. ఇది తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతూ రక్షణశాఖకు చేదేడో వాదోడుగా నిలుస్తుంది. శత్రు దేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని ఇది సేకరిస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి సమాచార సేకరణ కోసం భారత్ విమానాలపైనే ఆధారపడుతోంది. ఇకపై అంతరిక్షం నుంచే ఈ పని పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. శత్రుదేశాల రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎక్కడున్నాయో తెలుసుకోవడమే ఇమిశాట్ పని. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం, చిత్రాలను అందజేస్తుంది. గతంలో ఈ పనిచేయడానికి డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఇమిశాట్‌ రాకతో 24 గంటలు నిఘావేసే అవకాశం దక్కుతుంది. సాధారణంగా, శత్రుదేశాల విమానాలు, క్షిపణులను పసిగట్టడంలో రాడార్లదే కీలకపాత్ర. ఒకవిధంగా సైన్యాలకు రాడార్లు గుండెకాయ లాంటివి. అలాంటి రాడార్లనే ఇమిశాట్ లక్ష్యంగా చేసుకుని నిఘా వేస్తుంది. ప్రత్యర్థికి చెందిన రాడార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో నిత్యం ఓ కన్నేసి ఉంచే ఇమిశాట్.. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రక్షణ దళాలతో పంచుకుంటుంది. తద్వారా యుద్ధం సమయాల్లో శత్రుదేశాల రాడార్లను, కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసేందుకు మన సైన్యానికి వీలు కలుగుతుంది. రాడార్ల సాయం లేకుండా యుద్ధం చేయడం అంటే ఆత్మహత్యాసదృశమే. ప్రత్యర్థులు ఎక్కడ ఉన్నారో కనిపెట్టే రాడార్లు లేకుండా ఏ దేశ సైన్యం అయినా ఏమీ చేయలేదు. సరిగ్గా ఆ పాయింట్ ను ఆధారంగా చేసుకుని డీఆర్డీవో ఇమిశాట్ కు రూపకల్పన చేసింది. ఈ ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మెజర్ మెంట్ శాటిలైట్ ను ‘ప్రాజక్ట్ కౌటిల్య’ పేరుతో అభివృద్ధి చేశారు. ఇమిశాట్ కోసం భారత ప్రభుత్వం దాదాపు 432 కోట్లు ఖర్చు చేసింది. దీన్ని ఇజ్రాయెల్ దేశానికి చెందిన ‘సరాల్’ నిఘా ఉపగ్రహం స్ఫూర్తితో రూపొందించారు. ఇది ఇరవైనాలుగు గంటలు నిఘా వేసే ఉపగ్రహం కావడంతో దీన్నుంచి తప్పించుకోవడం శత్రుదేశాలకు అసాధ్యం. డీఆర్డీవో నిపుణులు దీనికి ముద్దుగా ‘రాడార్ కిల్లర్’ అని పేరుపెట్టారు. ఈ ప్రయోగం వల్ల రక్షణరంగం మరింత బలోపేతం అవుతుంది. భారత్‌ నిఘా విభాగంలోకి ఈ ప్రయోగంతో సరికొత్త అస్త్రం వచ్చి చేరినట్టయింది. భారత్‌ వద్ద ఇప్పటికే దాదాపు 8కిపైగా  నిఘా శాటిలైట్లు ఉన్నట్టు తెలుస్తోంది. కార్టోశాట్‌ సిరీస్‌లోని నాలుగు శాటిలైట్లు పూర్తిగా సైనిక అవసరాల కోసమే పనిచేస్తాయంటున్నారు. ఇక నుంచి శత్రుదేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని కనిపెట్టడం మన రక్షణ శాఖకు చాలా తేలిక కానుంది. అంటే సొంతంగా అంతరిక్ష ఫ్లాట్‌ ఫామ్ అందుబాటులోకి రానుంది. ఇదిలావుంటే, రాకెట్ ప్రయోగం సందర్భంగా ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. పీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం కావడంతో.. ఓవైపు దేశమంతా ఇస్రో ఘనతకు కీర్తిస్తూ.. శాస్త్రవేత్తలకు ప్రశంసలు కురిపిపిస్తుంటే.. రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్నప్పుడు ఇండిగో విమానానికి చెందిన పైలట్‌ వీడియోను తీశారు. ఈ ప్రయోగ సమయంలో ఇండిగో విమానం ప్రయోగ కేంద్రానికి 50 నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న పైలట్‌ కెప్టెన్‌ కరుణ్‌ కారుబయా.. నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్‌ ను వీడియో తీశారు. దానిని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌.. విమానం కుడి వైపు ఉన్న కిటికీ నుంచి పీఎస్‌ఎల్‌వీ శాటిలైట్‌ లాంచ్‌ను మీరూ చూడొచ్చు. అది మన రాకెట్టే..’ అని ప్రయాణికులకు చెప్పారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు ‘బ్యూటీ.. వావ్‌.. అమేజింగ్..’ అంటూ కేకలు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.