News

వాయుగుండంగా మారిన అల్పపీడనం

595views
  • ఆంధ్రాలోని 9 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్‌, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం శుక్రవారం నాటికి బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణించే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తూర్పుగోదావరి జిల్లాలో…

తుపాను ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలో అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

తమిళనాడులో భారీవర్షాలు

అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో భారీవర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాలు వరదలతో అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చెన్నై సహా ఉత్తర జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. చెన్నైలో గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తర చెన్నై, తమిళనాడు డెల్టా ప్రాంతాల్లోని ఎనిమిది జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి