
సరిహద్దుల్లో చైనా దుశ్చర్యల నేపథ్యంలో తూర్పు లడఖ్లో రెండు లైట్ కంబాట్ హెలికాప్టర్లు (ఎల్సీహెచ్)లను భారత్ మోహరించింది. ఇవి లేహ్లో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. భారత వాయు సేన కార్యకలాపాల్లో ఈ హెలికాప్టర్లు పాల్గొంటాయి. వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసింది. హెచ్ఏఎల్ బుధవారం ఈ వివరాలను ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
హెచ్ఏఎల్ సీఎండీ ఆర్ మాధవన్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో హెచ్ఏఎల్ పాత్ర చాలా కీలకమైనదని చెప్పారు. ప్రపంచంలోనే అతి తేలికైన యుద్ధ హెలికాప్టర్లను తాము తయారు చేశామని, వీటిని భారతీయ సాయుధ దళాల అవసరాలకు తగిన విధంగా రూపొందించామని తెలిపారు.
ఈ లైట్ కంబాట్ హెలికాప్టర్లు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో కూడినవి. పగలు, రాత్రి ఎలాంటి లక్ష్యాన్ని అయినా కచ్చితంగా ఛేదించగలవు. వేర్వేరు పరిస్థితుల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశాలకు ఆయుధాలను మోసుకుపోగలవు. అధిక వేడిగల, ఎత్తయిన ప్రదేశాల్లో ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఇవి ఉపయోగపడతాయి.





