
టిక్ టాక్తో సహా 59చైనా యాప్లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. భారత్ దారిలోనే అమెరికా అడుగులు వేస్తోంది. తాజాగా టిక్టాక్తోపాటు చైనా సామాజిక మాధ్యమాల యాప్లను నిషేధించే యోచనలో ఉన్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. ఓ అంతర్జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్ పాంపియో ఈ విధంగా అభిప్రాయపడ్డారు. ‘ఈ విషయాన్ని అధ్యక్షడు ట్రంప్ కన్నాముందే బహిరంగపరచడం ఇష్టం లేదు, కానీ, కచ్చితంగా చైనా యాప్లను నిషేధించే యోచనలో ఉన్నాం’ అని మైక్ పాంపియో స్పష్టం చేశారు.
చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అక్కడి కంపెనీలు, చైనా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని ఇప్పటికే అమెరికా చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టిక్టాక్ వంటి యాప్లు సేకరించే సమాచారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, చైనా యాప్లను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని మైక్ పాంపియో సమర్థించారు. ఆ యాప్లను నిషేధించడం సరైన నిర్ణయమేనని పాంపియో ఇదివరకే స్పష్టం చేశారు.
చైనా వంచన విధానంతోనే కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిందని అమెరికా ఆరోపిస్తోంది. సమయం దొరికినప్పుడల్లా చైనా తీరుపై విరుచుకుపడుతున్న అమెరికా, హాంగ్కాంగ్ వ్యవహారంలోనూ డ్రాగన్ దేశంపై గుర్రుగా ఉంది. తాజాగా యాప్ల నిషేధం దిశగా అడుగులు వేయడం గమనార్హం.





