News

కశ్మీరీలను జైలుకు పంపాలనుకుంటున్నారా.. కాంగ్రెస్‌పై ఒమర్ అబ్దుల్లా ఫైర్..

7views

వందేమాతరం పూర్తి గేయం ఆలాపనపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌ మధ్య వివాదం మరింత ముదురుతోంది. జమ్మూకశ్మీర్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ చేసిన విమర్శలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ‘కశ్మీరీలను జైలులో పెట్టాలని కాంగ్రెస్ కోరుకుంటుందా?’ అంటూ ప్రశ్నించారు.

పూర్తి ‘వందేమాతరం’ ఆలాపనపై ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనలను పాటించాల్సిందేనని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. కాగా, స్వాతంత్ర్య సమరయోధుల నిర్ణయాలను గౌరవిస్తూ పాటలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తమ కూటమి భాగస్వామి అయిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు సూచించారు. అయితే కాంగ్రెస్ సూచనను పక్కన పెట్టి ఫిల్మ్ ఫెస్టివల్‌లో వందేమాత్రం పూర్తి గేయాన్ని ఆలపించారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘అధికారిక కార్యక్రమాల్లో పూర్తి ‘వందేమాతరం’ను ఆలపించడం తప్పనిసరి. ఈ అంశంపై కాంగ్రెస్‌కు అభ్యంతరం ఉంటే పార్లమెంట్‌లో చట్టం ఏర్పడకుండా అడ్డుకోవాల్సింది. మా పార్టీ పూర్తి ‘వందేమాతరం’ను ఎప్పుడూ అధికారికంగా స్వీకరించలేదు. భవిష్యత్తులోనూ స్వీకరించబోదు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం, నిబంధనలను మాత్రం పాటిస్తాం. జాతీయ గేయాన్ని ఆలపించే సమయంలో గౌరవ సూచకంగా నిలబడకపోతే చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాతీయ గేయాన్ని అగౌరవపరిచి మేమందరం జైలుకెళ్లాలని కాంగ్రెస్ కోరుకుంటోందా’ అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.