
పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ సందర్భంగా మండపాల వెనుక మాంసాహార వంటకాలు తయారు చేయడంపై బాగేశ్వర్ ధామ్ పీఠాధీశ్వర్ ధీరేంద్ర శాస్త్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి పూజా మండపాల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హావ్రాలో నిర్వహించిన హనుమాన్ కథాశ్రవణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నవరాత్రులు ప్రారంభమైన వెంటనే బెంగాల్లోని పలు ప్రాంతాల్లో దుర్గాపూజ కోసం భారీ మండపాలను ఏర్పాటు చేస్తారని ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పూజా మండపాల వెనుక, వేదికల పక్కన మాంసాహారం, ఇతర ఆహార పదార్థాలను వండుతున్నారని పేర్కొన్నారు. దుర్గాపూజ జరుగుతున్న ప్రదేశాల్లో ఇలా చేయడం తనకు నచ్చదని అన్నారు.
‘అలాంటి వారిని బహిష్కరించండి’
ఈసారి నవరాత్రుల సందర్భంగా దుర్గాపూజ మండపాల వెనుక మాంసాహార వంటకాలు తయారు చేసే వారిని బహిష్కరించాలని బెంగాల్ ప్రజలకు ధీరేంద్ర శాస్త్రి పిలుపునిచ్చారు.
మతపరమైన విశ్వాసాలను పాటిస్తున్నామని చెప్పుకుంటూ మరోవైపు దుర్గాపూజ మండపాల వెనుక మాంసాహారం తయారు చేసే వారిని తాను మతపరమైన వ్యక్తులుగా భావించబోనని వ్యాఖ్యానించారు. అలాంటి వారిని కపటులుగా పిలుస్తామని అన్నారు.
నవరాత్రుల్లో హిందువులు మేల్కొనాలి
నవరాత్రుల సమయంలో హిందువులు అప్రమత్తంగా ఉండాలని, మతపరమైన విశ్వాసాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని బహిష్కరించాలని ధీరేంద్ర శాస్త్రి పిలుపునిచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నవరాత్రుల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ మండపాలను ఏర్పాటు చేసి దుర్గాదేవిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.




