
న్యూయార్క్: భారత జాతీయ జెండాను అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలిస్థానీ వేర్పాటువాదులకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గట్టి హెచ్చరిక జారీ చేశారు. దేశాన్ని, జాతీయ జెండాను అవమానిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు.
న్యూయార్క్లోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్న కార్యక్రమం సందర్భంగా స్టేడియం వెలుపల చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను రిజిజు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘ఆర్ఎస్ఎస్ను లేదా బీజేపీని విమర్శించే హక్కు మీకు ఉందని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం. కానీ మా దేశాన్ని అవమానించవద్దు. మా దేశాన్ని, జాతీయ జెండాను అవమానిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని రిజిజు తన పోస్టులో పేర్కొన్నారు.
స్టేడియం వెలుపల కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు నిరసనకు దిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి భారత జాతీయ జెండాను తన కాలికి చుట్టుకుని ఊపుతూ అవమానించినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు.





