
సైన్యం రహస్యాలు చేరవేసిన వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేసిన కేసులో బుధవారం రాత్రి జమ్మూ-కశ్మీర్ పోలీసులు మరోసారి మెట్పల్లికి వచ్చారు. నగదు బదిలీ చేసిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్కు చెందిన సరికెల లింగన్న(35)ను అదుపులోకి తీసుకుని మెట్పల్లి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్తో జమ్మూకు తరలించారు. జమ్మూ-కశ్మీర్ ఆర్మీ క్యాంపులో కార్మికుడిగా పనిచేసే రాజేశ్ అనే యువకుడు సైన్యం సమాచారాన్ని అనిత అనే మహిళకు చేరవేస్తున్నాడన్న ఫిర్యాదుపై జనవరిలో కేసు నమోదైంది. రాజేశ్ ఖాతాకు వివిధ బ్యాంకుల నుంచి సొమ్ము వచ్చినట్లు విచారణలో గుర్తించారు. జగిత్యాల యువకుడు లింగన్న ఖాతా నుంచి ఫిబ్రవరి 13న రూ.5 వేలు, 20న రూ.40 వేలు జమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన అక్కడి పోలీసులు ఈ నెల 3న ఇక్కడికి వచ్చి లింగన్నను అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు అతన్ని మెట్పల్లి కోర్టులో హాజరుపరిచారు. అక్కడి పోలీసులు వారెంట్ లేకుండా రావడంతో లింగన్న అరెస్ట్కు మెట్పల్లి జడ్జి అంగీకరించలేదు. దీంతో జమ్మూ కోర్టు నుంచి వారెంట్ కాపీతో పోలీసులు మళ్లీ బుధవారం రాత్రి మెట్పల్లికి చేరుకుని లింగన్నను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్తో అతన్ని జమ్మూకు తరలించారు.





