News

రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం – దీదీపై మోదీ నిప్పులు

101views

పశ్చిమ్ బెంగాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. ఉత్తర బెంగాల్‌లో జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సు వేదిక మార్పు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా మంత్రులు హాజరుకాకపోవడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై రాష్ట్రపతి స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగా ఆక్షేపించారు.

ప్రధాని మోదీ ఈ ఘటనను “సిగ్గుచేటు, అసాధారణ చర్య”గా అభివర్ణించారు. ప్రజాస్వామ్యం మరియు గిరిజన వర్గాల సాధికారతపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరిని ఈ ఘటన కలవరపరిచిందన్నారు. గిరిజన సమాజానికి చెందిన రాష్ట్రపతి వ్యక్తం చేసిన బాధ దేశ ప్రజలందరికీ ఆవేదన కలిగించిందని వ్యాఖ్యానించారు. బెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందని, రాష్ట్రపతిని అవమానించిన బాధ్యత టీఎంసీ ప్రభుత్వానిదేనని విమర్శించారు.

సంతాల్ సదస్సు వేదిక మార్పుపై అసంతృప్తి
రాష్ట్రపతి ముర్ము ఉత్తర బెంగాల్‌లో జరిగిన 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట ఈ కార్యక్రమాన్ని సిలిగురి సమీపంలోని బిధాన్‌నగర్‌లో నిర్వహించాల్సి ఉండగా, చివరికి బాగ్‌డోగ్రా విమానాశ్రయం సమీపంలోని గోసాయిపూర్‌కు మార్చారు. ఈ మార్పు కారణంగా సంతాల్ గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనలేకపోయారని ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.

“మమతా బెనర్జీ నాకు చెల్లెల్లాంటిది. అయినా ఆమె ఎందుకు రాలేదో తెలియదు. నామీద ఆమె కోపంగా ఉందేమో అనిపిస్తోంది” అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. అలాగే కొందరు సంతాళ్లు ఒకచోట చేరకుండా అడ్డుకుంటున్నట్టుగా అనిపించిందని కూడా ఆమె అన్నారు.

ప్రోటోకాల్ అంశంపై రాజకీయ తగాదా
ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు అధికారికంగా స్వాగతం పలకడం సాధారణం. అయితే ఈసారి సీఎం మమతా బెనర్జీ లేదా మంత్రులు హాజరుకాకపోవడం వివాదానికి కారణమైంది. ఈ అంశాన్ని బీజేపీ తీవ్రంగా ఎత్తిచూపుతూ, రాష్ట్రపతి పదవిని అవమానించారని ఆరోపించింది.

మమతా బెనర్జీ ప్రతిస్పందన
రాష్ట్రపతి వ్యాఖ్యలపై స్పందించిన మమతా బెనర్జీ మాత్రం రాజకీయ విమర్శలు చేశారు. రాష్ట్రపతి తన పదవికి తగినట్లుగా వ్యాఖ్యలు చేయాలని సూచిస్తూ, బెంగాల్‌లో గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. బీజేపీ ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆమె ఆరోపించారు.

ఈ ఘటనతో కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, గిరిజన సమాజానికి సంబంధించిన అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ వివాదం మరింత రాజుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.