
శ్రీసత్యసాయి జిల్లా అగళి స్థానిక శంకరేశ్వర ఆలయంలో నాలుగు శతాబ్దాల క్రితం చోళుల హయాంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం అపహరణ కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు డీఎస్పీ నర్శింగప్ప తెలిపారు. నాలుగు నెలల క్రితం ఈ ఘటన చేసుకోగా… ఈ అంశంపై గ్రామస్తులతో కలసి అగళి పీఎస్లో డీఎస్పీ సమావేశమై చర్చించారు. విగ్రహం చోరీ చేసిన దుండుగులు ఎంతటి వారైనా ఉపేక్షించరాదని ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. చోరీ జరిగి నాలుగు నెలల కావస్తున్నా దర్యాప్తులో పురోగతి లేదంటూ అసహనం వ్యక్తంచేశారు. ఇప్పటికై నా దోషులను గుర్తించి అరెస్ట్ చేయకపోతే ఆలయంలోని నిధి నిక్షేపాలనూ కొల్లగొట్టే ముఠాలు చెలరేగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. వినాయక విగ్రహం చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు బృందాలను రంగంలో దించినట్లు వివరించారు. త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మడకశిర సీఐ రాజకుమార్, ఎస్ఐ శోభారాణి పాల్గొన్నారు.





