
అమ్జేరా వీరుడు బఖ్తావర్ సింగ్ బలిదానం
మన దేశంలోని ప్రతి మూల, ధైర్యవంతులైన అమరవీరుల అద్భుతమైన గాథలతో నిండి ఉంది. అటువంటి వీరులలో ఒకరు మాల్వా ప్రాంతానికి చెందిన మహారాణా బఖ్తావర్ సింగ్. ప్రస్తుత మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మరియు ఇండోర్ చుట్టుపక్కల సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధార్ జిల్లాలోని ‘అమ్జేరా’ పట్టణానికి ఆయన పాలకుడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ఆయన మధ్యప్రదేశ్లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. అనేకసార్లు బ్రిటీష్ సైన్యాన్ని ఓడించినప్పటికీ, వారు చివరకు కుట్ర పన్ని ఆయనను బంధించారు. దేశం కోసం చివరకు లొంగిపోయిన మహారాణా బఖ్తావర్ సింగ్ను ఫిబ్రవరి 10, 1858న ఇండోర్లోని MTH కాంపౌండ్లో ఉరితీశారు.
బ్రిటీష్ వారిని బఖ్తావర్ సింగ్ ఓడించిన తీరు
కొంతమంది రాజులు తమ స్వార్థం కోసం బ్రిటీష్ వారికి సహకరించడమే శ్రేయస్కరమని భావించిన కాలంలో, బఖ్తావర్ సింగ్ ఏమాత్రం వెరవకుండా వారిపై ఉగ్రరూపంతో తిరుగుబాటు చేశారు. జూలై 3, 1857న బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన ఆయన, మొదట ‘భోపావర్’ కంటోన్మెంట్పై దాడి చేసి అక్కడి బ్రిటీష్ జెండాను కిందకు దించేశారు. దీంతో భీతిల్లిన బ్రిటీష్ కెప్టెన్ హచిన్సన్, తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన కుటుంబంతో కలిసి మారువేషంలో మధ్యప్రదేశ్లోని ఝబువాకు పారిపోయాడు.
అయితే, ఆగస్టు 1857లో ఇండోర్ రాజు తుకోజీరావు హోల్కర్ సహాయంతో బ్రిటీష్ వారు తిరిగి భోపావర్ కంటోన్మెంట్ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. దీనిపై ఆగ్రహించిన బఖ్తావర్ సింగ్, అక్టోబర్ 10, 1857న మళ్లీ భోపావర్పై విరుచుకుపడ్డారు. 3 గంటల పాటు సాగిన భీకర పోరాటం తర్వాత ఆయన మరోసారి ఘనవిజయం సాధించారు. అక్కడితో ఆయన ఆగకుండా.. భోపావర్ తర్వాత మాన్పూర్-గుజ్రీ మరియు మండలేశ్వర్ వంటి అనేక బ్రిటీష్ సైనిక స్థావరాలపై దాడులు చేసి వారిని తరిమికొట్టారు. బఖ్తావర్ సింగ్ కార్యకలాపాలు మితిమీరిపోతుండటంతో, అక్టోబర్ 31, 1857న బ్రిటీష్ వారు భారీ సైన్యంతో ధార్ కోటపై దాడి చేశారు. మహారాణాను ఇప్పుడే అడ్డుకోకపోతే భవిష్యత్తులో తమకు పెను ప్రమాదంగా మారుతారని గ్రహించిన బ్రిటీష్ వారు, లెఫ్టినెంట్ హచిన్సన్ కనుసన్నల్లో ఒక పూర్తి బెటాలియన్ను పంపి ఆయనను బంధించడానికి ఒక కుట్ర పన్నారు.
కుట్రతో బంధనం
మహారాణా బఖ్తావర్తో నేరుగా తలపడి గెలవలేకపోయిన బ్రిటీష్ వారు, తమ పాత వ్యూహమైన ‘విభజించు-పాలించు’ విధానాన్ని అమలు చేశారు. వారు అమ్జేరా రాజ్యంలోని కొందరు భూస్వాములకు లంచాలు ఇచ్చి, వారిని దేశద్రోహానికి పురికొల్పారు. ఆ భూస్వాములను మధ్యవర్తులుగా వాడుకుంటూ, శాంతి చర్చల పేరుతో మహారాణాను నమ్మించి రప్పించేలా ప్లాన్ చేశారు. నవంబర్ 11, 1857న తన నమ్మకస్థులైన అనుచరులు వద్దని హెచ్చరించినప్పటికీ, చర్చల కోసం కొద్దిమంది సహచరులతో కలిసి మహారాణా, ధార్ వైపు బయలుదేరారు. అదే సమయంలో, హైదరాబాద్కు చెందిన ఒక అశ్వికదళం ఆయనను దారిలోనే అడ్డుకుంది. వెనువెంటనే బ్రిటీష్ వారు ఆయనకు వెన్నుపోటు పొడిచి బంధించారు. అయితే మహారాణాను విడిపించేందుకు రాఘోగఢ్ (దేవాస్) కు చెందిన ఠాకూర్ దౌలత్ సింగ్, ‘మౌ’ కంటోన్మెంట్పై దాడి చేసినా.. అది సఫలం కాలేదు.
మొదట ఆయనను మౌ (Mhow) లో బంధించారు. అయితే మహారాణాను విడిపించడానికి మాల్వా అంతటా నిరంతర ప్రయత్నాలు జరిగాయి. దీనితో ఆయనను మరింత చిత్రహింసలకు గురిచేయడానికి ఇండోర్కు తరలించారు. డిసెంబర్ 21, 1857న ఇండోర్ రెసిడెన్సీలో విచారణ జరిగింది. అక్కడ చాలా మంది న్యాయవాదులు ఉన్నప్పటికీ, మహారాణా బ్రిటీష్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి నిరాకరించారు మరియు తన రక్షణ కోసం ఎటువంటి వాదనలు వినిపించలేదు.
ఆ తర్వాత, రాజు యుద్ధ సహచరులైన కామ్దార్ గులాబ్రాజ్ పట్వారీ, మోహన్లాల్ ఠాకూర్, భవానీ సింగ్ సంధ్లా మరియు ఇతరులను రాజు కళ్ల ముందే ఉరితీశారు. అయినా మహారాణా ఏమాత్రం చలించలేదు. మరోవైపు, రాజు తరపు న్యాయవాది చిమన్లాల్ రామ్, ఆయన సేవకుడు మన్సారామ్ మరియు ప్రార్థనా నిర్వాహకుడు (ఫకీర్)లను జైలులో ఉంచి తీవ్రమైన శారీరక మరియు మానసిక చిత్రహింసలకు గురిచేశారు. చివరగా, ఫిబ్రవరి 10, 1858న తన దేశం కోసం సర్వస్వం అర్పించిన మహారాణా బఖ్తావర్ సింగ్ను ఇండోర్లోని MTH కాంపౌండ్లో ఉరితీశారు.
రెండుసార్లు ఉరి: అమర చరిత్ర
ఆయనను బంధించడం ఎంత కష్టమో, ఉరితీయడం కూడా అంత సులభం కాలేదు. ఇండోర్లోని ఒక వేప చెట్టుకు రాజును ఉరితీయడానికి బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు, ఆయన శరీర బరువుకు ఆ ఉరితాడు తెగిపోయింది. అప్పటి నిబంధనల ప్రకారం, ఒకసారి ఉరితాడు తెగితే ఆ శిక్షను అక్కడితో నిలిపివేయాలి. కానీ మహారాణా అంటే బ్రిటీష్ వారికి ఉన్న భయం ఎంతటిదంటే, వారు తమ స్వంత చట్టాలనే మార్చివేసి ఆయనను రెండోసారి ఉరితీశారు. అలా ఫిబ్రవరి 10, 1858న, రెండో ప్రయత్నంలో ఆ వీర రాజు కేవలం 34 ఏళ్ల వయసులోనే అమరుడయ్యారు.





