News

పాకిస్తాన్ వలస హిందువులకు నివాసం కల్పించండి

164views

పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన షెడ్యూల్డ్ కాస్ట్ హిందువులకు కేవలం భారత పౌరసత్వం ఇవ్వడం మాత్రమే సరిపోదని, వారికి గౌరవప్రదమైన నివాస సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని మజ్ను కా తిలా ప్రాంతంలో, సిగ్నేచర్ బ్రిడ్జి సమీపంలో నివసిస్తున్న కుటుంబాల బలవంతపు తరలింపుపై దాఖలైన పిటిషన్ పై సోమవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ కేసును విచారించిన ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎంఎం సుంద్రేష్, ఎన్ కోటేశ్వర్ సింగ్ పాల్గొన్నారు. పౌరసత్వం ఇచ్చినప్పటికీ, ఈ కుటుంబాలు ఇంకా తమ నివాసాల నుంచి తరిమేసే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. పౌరసత్వంతో పాటు పునరావాసం, గృహ వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. అలా చేస్తేనే ఈ వర్గాలు గౌరవంగా జీవించగలుగుతాయని పేర్కొంది.

ఈ అంశంపై ప్రభుత్వం నాలుగు వారాల్లో తన సమాధానం దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అంతవరకూ ఈ కుటుంబాలను తరలించేలా ఎలాంటి చర్యలు లేదా అభివృద్ధి పనులు చేపట్టవద్దని ఆదేశిస్తూ తాత్కాలిక రక్షణ కల్పించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో సుమారు 250 కుటుంబాలకు చెందిన వెయ్యికి పైగా మందికి ఉపశమనం లభించింది. సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వీరు, తమ నివాసం, పునరావాసంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీలో వలస వచ్చిన కుటుంబాల హక్కులు, గౌరవప్రదమైన జీవనంపై సాగుతున్న చర్చలకు మరింత ప్రాధాన్యాన్నిచ్చింది.