
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర ఆలయ క్షేత్రపాలకుడు పద్మనాభ స్వామి గిరి ప్రదక్షిణతోసర్వ రోగాలు తొలగి… ఆరోగ్యం సిద్ధిస్తుందని గ్రామ పెద్దలు బొంగు దొరబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా అన్నుపురం వద్ద పద్మనాభ స్వామి గిరి ముఖద్వారం వద్ద ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటా మాఘమాస పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎనిమిదేళ్ల తరువాత నిర్వహించిన పద్మనాభగిరి ప్రదక్షిణకు వందలాది భక్తులు హాజరవడం విశేషమన్నారు. ఇకపై గిరిప్రదక్షిణకు రెండు వారాల ముందు నుంచి ప్రచారం చేస్తామని తెలిపారు. పద్మనాభగిరి ముఖద్వారం అన్నుపురం వద్ద ప్రారంభించిన గిరి ప్రదక్షిణ కరకవలస మీదుగా వంశధార కాలువ గట్టుపై నుంచి దోమనాపల్లి దరి పద్మనాభగిరి ముఖద్వారం వద్దకు 5 కిలోమీటర్ల మేర సాగింది. ప్రదక్షిణ అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.





