News

పాకిస్తాన్ లో హిందూ యువకుడు కోహ్లీ హత్య.. సింధ్ ప్రావిన్స్ లో ఉద్రిక్తత

152views

ఒక పక్క బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులతో ఆందోళన వ్యక్తమవుతుంటే.. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా హిందువును కాల్చి చంపారు. గతవారం పాకిస్తాన్ లో కైలాష్ కోహ్లి (25) అనే యువకుడిని దుండగులు అతి సమీపంనుంచి కాల్చి చంపారు. ఈ ఘటన పాకిస్తాన్లోని, సింధ్ ప్రావిన్స్, బదిన్ జిల్లా తల్హార్ తహసిల్ పరిధిలో జనవరి 4న జరిగింది. పోలీసులు, మీడియా కథనం ప్రకారం.. హిందువైన కైలాష్ స్థానికంగా వ్యవసాయం చేస్తూ ఉండేవాడు.

అతడు సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా ఉండేవాడు. అక్కడి హిందువులపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. గళమెత్తేవాడు. దీంతో అతడికి స్థానిక నాయకుడిగా గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే అతడిని ఈ నెల 4న గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. బుల్లెట్లు అతడి ఛాతీలో దిగడంతో కైలాష్ అక్కడికక్కడే మరణించాడు. అతడి హత్య జరిగినప్పటి నుంచి అక్కడి హిందువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇటీవల మరింత ఉదృతంగా ఆందోళన చేస్తున్నారు. బదిన్ ప్రాంతంలోని రోడ్లను ఆందోళనకారుల బ్లాక్ చేశారు. కైలాష్ మృతికి న్యాయం చేయాలని, హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వరుసగా రెండు రోజులనుంచి నిరసనలు కొనసాగుతున్నాయి.

జస్టిస్ ఫర్ కైలాష్ అంటూ నినదిస్తున్నారు. కొంతకాలంగా హిందువులు తీవ్ర భయంతో, అభద్రతా భావంతో బతుకుతున్నట్లు తెలిపారు. బలవంతపు మత మార్పిడులు, వేధింపులు, అత్యాచారాలు వంటివి ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తమకు న్యాయం కావాలని, భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు పాక్ లోని మైనారిటీ హక్కుల సంస్థ చైర్మన్ శివ కచ్చి స్పందించారు. హిందువులపై దాడుల్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.