
ఆగ్రా పట్టంలోని ప్రఖ్యాత ‘తాజ్మహల్’ లో మూడు రోజులు ఉర్సు ఉత్సవంపై నిషేధం విధించాలని ఆల్ ఇండియా మహాసభ డిమాండ్ చేసింది. ఉర్సు ఉత్సవం ప్రారంభం కానున్న నేపథ్యంలో హిందూ మహాసభ కార్యకర్తలు తాజ్మహల్ వెలుపల ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్పై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కు ఒక మెమొరాండం సమర్పించారు.
మహాసభ అధ్యక్షుడు మీరా రాధోడ్ మాట్లాడుతూ, తాజ్మహల్లో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. స్థానికులు శుక్రవారాల్లో తాజ్మహల్ ప్రాంగణంలో నమాజ్ చేసుకునేందుకు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని, తాజ్ మహల్ కాంప్లెక్స్ లోపల ఉర్సు ఉత్సవం ప్రస్తావన చరిత్రలో ఎక్కడా లేదని చెప్పారు. తాజ్మహల్ లోపల ఉర్సు ఉత్సవానికి అనుమతిస్తే తమ కార్యకర్తలు ‘శివతాండవం’ చేపడతారని చెప్పారు.
తాజ్మహల్ వద్ద ఉర్సు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ మహాసభ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం ఆగ్రా కోర్టులో ఉంది. ఈ పిటిషన్ గురువారంనాడు విచారణకు రానుంది. కాగా, హిందూమహాసభ నిరసల దృష్ట్యా జిల్లా యంత్రాగం తాజ్మహల్ లోపల, బయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తాజ్గంజ్, పరిసర ప్రాంతాల్లో ముందస్తు చర్యగా భద్రతా బలగాలను మోహరించింది. తాజ్ మహల్ ఉన్న చోట ‘తేజో మహల్’ పేరుతో శివాలయం ఉండేదని, దాన్ని మొఘల్ చక్రవరి షాజహాన్ కూల్చివేసి తాజ్మహల్ కట్టించారని హిందూ సంస్థల వాదనగా ఉంది.





