
పంజాబ్లోని తల్వాన్ గ్రామంలో జన్మించిన స్వామి శ్రద్ధానంద, 1900ల ప్రారంభంలో ఆర్యసమాజ్ యొక్క ప్రముఖ సంస్కర్తలలో ఒకరిగా ఎదిగారు. వేద విద్యను పునరుద్ధరించడానికి ఆయన 1902లో హరిద్వార్ సమీపంలో గురుకుల్ కాంగ్రీని స్థాపించారు. ఆయన సామూహిక పునరాగమన (శుద్ధి) కార్యక్రమాలకు నాయకత్వం వహించడమే కాకుండా, హిందూ ఐక్యతను పటిష్టం చేయడం కోసం ప్రతి నగరంలో ‘హిందూ-రాష్ట్ర మందిరాల’ను నిర్మించాలని ఆకాంక్షించారు.
స్వామి శ్రద్ధానంద హిందుత్వ పునరుద్ధరణలో 1919 సంవత్సరం అత్యంత కీలకమైనది. 1919, ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీలోని జామా మసీదు నుండి ఆయన ఒక చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అక్కడ ఆయన హిందుత్వ పునరుద్ధరణకు సంబంధించిన తన బృహత్తర ప్రణాళికను వెల్లడించారు. వేదాలు, ఉపనిషత్తులు, గీత, రామాయణ మరియు మహాభారతాలను అధ్యయనం చేయడానికి 25,000 మంది కూర్చునే సామర్థ్యం గల భారీ దేవాలయాల నిర్మాణం, యుద్ధ విద్యల శిక్షణ కోసం అఖాడాలు, మరియు ప్రతి గోడపై గాయత్రీ మంత్రాన్ని లిఖించడం వంటి తన ప్రణాళికలను వివరించారు. మద్దతుదారులు దీనిని హర్షధ్వానాలతో ఆమోదించగా, తీవ్రవాద శక్తులలో మాత్రం ఆగ్రహం పెరిగింది. ఈ చారిత్రాత్మక ఘట్టం ఎందరినో ప్రేరేపించింది. అటువంటి ఒక ప్రేరణాత్మక మత మార్పిడి కథ స్వామి జీవితంపై తక్షణ ప్రభావం చూపింది. ఈ కథనం స్వామి జీవితంలోని ఆ ముఖ్యమైన ఘట్టాన్ని మీ ముందుకు తెస్తోంది.
1926 మార్చి 25న ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఆర్యసమాజ్ ఆలయంలో ఒక విశేష సంఘటన జరిగింది. అస్గారీ బేగం అనే ముస్లిం మహిళ తన ఇద్దరు కుమారులు మరియు సవతి కుమార్తెలతో కలిసి బహిరంగంగా ఇస్లాంను త్యజించి, హిందూ మతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. స్వామి శ్రద్ధానంద గారి మార్గదర్శకత్వంలో, వారు పవిత్రమైన ‘శుద్ధి’ సంస్కారాన్ని పొందారు. ఇది వేద మూలాలను తిరిగి పొందే ఒక శుద్ధీకరణ ప్రక్రియ. ఆ రోజున అస్గారీ బేగం ‘శాంతిదేవి’గా మారారు.
ఈ మత మార్పిడి వార్త ఢిల్లీ వీధుల్లో దావాగ్నిలా వ్యాపించింది. ఇది సంస్కర్తలలో ఆనందాన్ని నింపగా, ఆమె బంధువులలో మాత్రం ఆగ్రహాన్ని రగిల్చింది. 3 నెలల తర్వాత, అస్గారీ బేగం బంధువులు.. ఆలయంపై దాడి చేసి, ఆమెను తిరిగి రావాలని డిమాండ్ చేశారు. ఎన్నో బెదిరింపులు ఎదురైనప్పటికీ, శాంతిదేవి తిరిగి ఇస్లాం మతంలోకి వెళ్ళడానికి నిరాకరించారు. “నేను నా మార్గాన్ని ఎంచుకున్నాను” అని ఆమె ఖచ్చితంగా ప్రకటించారు. ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తతతో నిండిపోయింది. ఈ ఒక్క సంఘటన మతపరమైన సరిహద్దులను చీల్చి, జామా మసీదు ప్రసంగం వల్ల కలిగిన ఆగ్రహాన్ని ఒక పెద్ద కుట్రగా మార్చింది. దీంతో ముస్లిం మత ఛాందసవాదులు స్వామిపై పగ తీర్చుకోవడానికి కుట్ర పన్నారు.
1926 డిసెంబర్ 23న, స్వామి శ్రద్ధానంద తన నయా బజార్ నివాసంలో బ్రోన్చియల్ న్యుమోనియా (Bronchial Pneumonia) నుండి కోలుకుంటున్న సమయంలో, అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి ఆయనపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. స్వామి శ్రద్ధానంద అక్కడికక్కడే అమరత్వం పొందారు. తన ఆశయాల కోసం మరియు దేశం కోసం ఆయన తన ప్రాణాలను అర్పించారు.
రత్నగిరి ప్రవాసంలో ఉన్న సమయంలో, వీర సావర్కర్ 1927 జనవరి 10న ‘శ్రద్ధానంద వీక్లీ’ పత్రికను ప్రారంభించారు. ఇది స్వామి శ్రద్ధానందకు అర్పించిన ఒక నిప్పులు చెరిగే నివాళి. ఈ పత్రిక హిందూ ఐక్యత, శుద్ధి మరియు అంటరానితన నిర్మూలన వంటి అంశాల మేళవింపుగా సాగింది. 1930లో ఈ పత్రిక మూతపడినప్పటికీ, ఒక దార్శనిక ప్రసంగం, ఒక మహిళా స్వేచ్ఛ మరియు క్రూరమైన మతోన్మాదం చరిత్రను ఎలా మార్చివేశాయో ఈ పత్రిక శాశ్వతం చేసింది. నిందితుడు రషీద్కు 1927లో ఉరిశిక్ష విధించబడింది. అయితే ఆ నిర్ణయాన్ని మహాత్మా గాంధీ విమర్శించడం గమనార్హం.





