
ప్రేమ కోసం పాక్ వెళ్లి స్థానికుడిని వివాహమాడిన ఓ భారతీయ మహిళను పాక్ అధికారులు స్వదేశానికి తిప్పి పంపారు. అటారీ- వాఘా సరిహద్దు వద్ద ఆమెను సోమవారం భారత్కు అప్పగించారు.
ఎవరీ భారతీయ వనిత..
పంజాబ్కు చెందిన సరబ్జీత్ కౌర్ గతేడాది నవంబర్లో పాకిస్థాన్కు వెళ్లారు. సిక్కు గురువు గురునానక్ దేవ్జీ జన్మస్థలమైన నన్కానా సాహిబ్ను సందర్శించేందుకు ఓ సిక్కు బృందంతో కలిసి ఆమె వెళ్లారు. అయితే, పాక్కు చేరుకున్నాక సరబ్జీత్ కనిపించకుండాపోయారు. ఆ తరువాత లాహోర్ సమీపంలోని షేఖ్పురా జిల్లాకు చెందిన నసీర్ హుస్సేన్ను పెళ్లి చేసుకున్నారు. ఇష్టపూర్వకంగానే తాను మతం మారి ఈ వివాహం చేసుకుంటున్నట్టు కూడా తెలిపారు. తన పేరును నూర్ హుస్సేన్గా మార్చుకున్నారు. నవంబర్ 5న ఈ వివాహం జరిగినట్టు సమాచారం. పెళ్లి తరువాత ఆ జంట కనిపించకుండా పోవడంతో పోలీసులు కూడా గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఈలోపు నవంబర్ 18న ఆ జంట లాహోర్ హైకోర్టును ఆశ్రయించింది. పెళ్లిని రద్దు చేసుకోవాలంటూ తమను పోలీసులు వేధిస్తున్నారని వారు ఆరోపించారు. తాను పాకిస్థానీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, పాక్ పౌరసత్వం తీసుకునేందుకు సిద్ధమైనట్టు భారతీయ దౌత్య కార్యాలయానికి కూడా సమాచారం అందించానని సరబ్జీత్ కౌర్ తెలిపారు. తాను డైవర్సీనని కూడా వెల్లడించారు. తనకు నజీర్ 7 ఏళ్లుగా పరిచయమని ఆమె చెప్పినట్టు సమాచారం.
దీంతో, కోర్టు వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆ జంటను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను ఆదేశించింది.





