
189views
మహారాష్ట్రలోని పుణెలో ఫెర్గూసన్ కళాశాలలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో అతిపెద్ద పోస్టర్ల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నమోదైనట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయ నిర్ణేత స్వప్నిల్ డాంగ్రికర్ శనివారం ప్రకటించారు. గిరిజన పదాలతో కూడిన 1,678 పోస్టర్లను ఈ ఎగ్జిబిషనులో ప్రదర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో ప్రదర్శించిన 1,365 పోస్టర్ల రికార్డును పుణె ప్రదర్శన అధిగమించినట్లు నిర్వాహకులు తెలిపారు. గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జీవితం, చేసిన సేవలను ఈ ప్రత్యేక ప్రదర్శన ద్వారా వివరించామని.. సాధించిన రికార్డు ఆయన స్మృతికి నివాళి అని పేర్కొన్నారు. నేషనల్ బుక్ ట్రస్టు (ఎన్బీటీ) ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శన డిసెంబరు 21 వరకు కొనసాగనుంది.





