News

మదానీ వ్యాఖ్యలను సుప్రీం సుమోటాగా స్వీకరించాలి

143views

జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అణచివేత ఉంటే జిహాద్ ఉంటుందంటూ ఆయన చేసిన ప్రకటనపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగ సంస్థలను సవాలు చేస్తూ ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈసందర్భంగా బీజేపీ నేతలు ఆరోపించారు.
ఇటీవల బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్ వంటి కేసుల్లో ప్రభుత్వ ఒత్తిడితోనే కోర్టులు తీర్పులు ఇస్తున్నాయని మదానీ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడలేనప్పుడు సుప్రీంకోర్టును ‘సుప్రీం’ అని పిలవడానికి కూడా అర్హత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ వంటి పదాలతో పవిత్రమైన జిహాద్‌ను వక్రీకరిస్తున్నారని, అణిచివేత ఉంటే జిహాద్ ఉంటుంది అని ఆయన అన్నారు.

మదానీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ తీవ్రంగా స్పందించారు. దేశంలో కొత్త జిన్నాలు పుట్టుకొస్తున్నారని, ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మదానీపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మదానీ లాంటి వాళ్లే టెర్రరిస్టులను, జిహాదీలను తయారు చేస్తారని, దేశంలో అశాంతి సృష్టించే వారిని సుప్రీంకోర్టు ఉరితీస్తుందని శర్మ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, హద్దుల్లో ఉండాలని ఆయన హెచ్చరించారు.