
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కలశజ్యోతి మహోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ ఆలయ అధికారులకు సూచించారు. భవానీ దీక్షలను పురస్కరించుకుని డిసెంబరు 4వ తేదీ సత్యనారాయణపురంలోని శివరామ కృష్ణ క్షేత్రం నుంచి కలశజ్యోతి మహోత్సవం జరగనుంది.
ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లపై చైర్మన్, ఈవోలు ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహా మండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్లో సమీక్ష సమావేశం జరిగింది. కలశజ్యోతులతో ఇంద్రకీలాద్రికి చేరుకునే భవానీలు, భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం, ఆలయ ప్రాంగణంలో తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలు, జ్యోతులను ఉంచడానికి అనువైన స్థలం గుర్తించడంతో పాటు మంటలను అదుపు చేయడానికి అవసరమైన పరికరాలను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో వైదిక కమిటీ, ఇంజినీరింగ్, ఫెస్టివల్ కమిటీ, అన్నదానం, ప్రసాదాల తయారీ విభాగంతో పాటు ప్రధాన ఆలయ అధికారులు పాల్గొన్నారు.





